కాబూల్ వర్సిటీలో కాల్పులు.. 19 మంది విద్యార్థులు మృతి
ABN , First Publish Date - 2020-11-03T10:37:55+05:30 IST
అఫ్ఘానిస్థాన్లోని కాబూల్ విశ్వవిద్యాలయం సోమవారం నెత్తురోడింది. ముసుగులు ధరించిన ముగ్గురు ముష్కరులు విద్యార్థులపై కాల్పులకు తెగబడ్డారు
- మరో 22 మందికి గాయాలు
- విద్యార్థులపై బాంబు దాడి
- పుస్తక ప్రదర్శన లక్ష్యంగా కాల్పులు?
- ముగ్గురు ముష్కరులు హతం
కాబూల్, నవంబరు 2: అఫ్ఘానిస్థాన్లోని కాబూల్ విశ్వవిద్యాలయం సోమవారం నెత్తురోడింది. ముసుగులు ధరించిన ముగ్గురు ముష్కరులు విద్యార్థులపై కాల్పులకు తెగబడ్డారు. చెల్లాచెదురవుతున్న విద్యార్థులపై బాంబు దాడి చేశారు. వర్సిటీలో జరిగిన పుస్తక ప్రదర్శన లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 19మంది మృతిచెందగా.. 22 మందికి గాయాలయ్యాయి. ‘‘ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. చూస్తుండగానే నా మిత్రులు కొందరు నేలకొరిగారు. తప్పించుకోవడానికి వర్సిటీ గోడ దూకాం. ఆ తర్వాత మిగతా వారికి సాయంగా ఓ పెద్ద స్టూల్ను అందజేశాం’’ అని ఫతుల్లా అనే విద్యార్థి వెల్లడించారు. భద్రతా బలగాలు క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించాయి. 6 గంటల పాటు జరిగిన ఆపరేషన్లో ముగ్గురు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ కాల్పులకు తమదే బాధ్యత అంటూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. అయితే.. ఇది అఫ్ఘాన్, విద్యావ్యవస్థ శత్రువుల పని అని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తారీఖ్ అరియాన్ అన్నారు.
కాగా.. పుస్తక ప్రదర్శనపై కాల్పులు, బాంబుదాడి జరిగిన నేపథ్యంలో పొరుగుదేశం ఇరాన్ ఆందోళన చెందుతోంది. 40 మంది ఇరాన్ పబ్లిషర్లకు చెందిన స్టాళ్లను ప్రారంభించేందుకు ఆ దేశ రాయబారి బహదోర్ అమినియన్, సాంస్కృతిక విభాగం అధికారి మొజ్తబా నోరూజీ ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిసింది. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఎ్సఎన్ఏ దీన్ని ధ్రువీకరించింది. గత ఏడాది కూడా కాబూల్ విశ్వవిద్యాలయం మెయిన్ గేటు వద్ద జరిగిన బాంబుదాడిలో 8 మంది విద్యార్థులు మృతిచెందారు. అంతకు ముందు దస్త్-ఎ-బార్చీలోని ఓ విద్యా సంస్థపై ఐఎస్ ఉగ్రవాద సంస్థ జరిపిన బాంబు దాడిలో 24 మంది విద్యార్థులు.. 2016లో కాబూల్లోని అమెరికన్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల్లో 13 మంది విద్యార్థులు మరణించారు.