థాయ్‌లాండ్ నుంచి స్వదేశానికి బయల్దేరిన 153 మంది భారతీయులు

ABN , First Publish Date - 2020-09-02T20:17:41+05:30 IST

మహమ్మారి కరోనా నేపథ్యంలో థాయ్‌లాండ్‌లో చిక్కుకుపోయిన 153 మంది భారతీయులు మంగళవారం 'వందే భారత్ మిషన్'‌‌(వీబీఎం)లో భాగంగా ప్రత్యేక ఎయిరిండియా విమానంలో స్వదేశానికి బయల్దేరారు.

థాయ్‌లాండ్ నుంచి స్వదేశానికి బయల్దేరిన 153 మంది భారతీయులు

బ్యాంకాక్: మహమ్మారి కరోనా నేపథ్యంలో థాయ్‌లాండ్‌లో చిక్కుకుపోయిన 153 మంది భారతీయులు మంగళవారం 'వందే భారత్ మిషన్'‌‌(వీబీఎం)లో భాగంగా ప్రత్యేక ఎయిరిండియా విమానంలో స్వదేశానికి బయల్దేరారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా స్పందించిన థాయ్‌లాండ్‌లోని భారత ఎంబసీ... "వందే భారత్ మిషన్‌లో భాగంగా ఇది థాయ్‌లాండ్ నుంచి ఇండియాకు వస్తున్న 12వ విమానం. ఏఐ 335 విమానం మంగళవారం బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి 153 ప్రయాణికులతో బయల్దేరింది. ప్రవాసుల తరలింపులో సహకరిస్తున్న థాయ్‌లాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, థాయ్ ఇమ్మిగ్రేషన్, విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్ ఇండియాకు ప్రత్యేక ధన్యవాదాలు" అని పేర్కొంది.


కాగా, కరోనా వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారత ప్రవాసులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం మే 6న 'వందే భారత్ మిషన్‌'(వీబీఎం)ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు ఈ మిషన్ ద్వారా వివిధ దేశాల నుంచి 12,60,118 మంది భారతీయులను స్వదేశానికి తరలించడం జరిగిందని తాజాగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు వీబీఎం ఐదు దశలు పూర్తి చేసుకుని... సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆరో విడతలోకి అడుగు పెట్టింది. ఈ ఆరో దశలో కూడా సాధ్యమైనంత వరకు విదేశాల్లో చిక్కుకున్న భారత ప్రవాసులను స్వదేశానికి తీసుకొస్తామని ఈ సందర్భంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.        

Updated Date - 2020-09-02T20:17:41+05:30 IST