వందే భారత్ మిషన్: 10.59 లక్షల మంది ప్రవాసులకు లబ్ధి
ABN , First Publish Date - 2020-08-06T20:12:38+05:30 IST
కరోనా లాక్డౌన్ వల్ల వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారత ప్రవాసులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం 'వందే భారత్ మిషన్' చేపట్టిన సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ వల్ల వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారత ప్రవాసులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం 'వందే భారత్ మిషన్' చేపట్టిన సంగతి తెలిసిందే. మే 6న ప్రారంభమైన ఈ మిషన్ ఇప్పటివరకు నాలుగు దశలు పూర్తి చేసుకుంది. ఆగస్టు 1 నుంచి ఐదో దశ మొదలైంది. కాగా, ఈ మిషన్ ద్వారా ఇప్పటివరకు 10 లక్షల 59వేల మంది ప్రవాసులు లబ్ధి పొందారని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. 9 లక్షల 39వేల మందిని వివిధ దేశాల నుంచి స్వదేశానికి తరలిస్తే... లక్ష 20 వేల మంది భారత్ నుంచి విదేశాలకు వెళ్లారని తెలిపారు. బుధవారం కూడా విదేశాల నుంచి 3,841 మంది ఇండియాకు వచ్చారని ఆయన పేర్కొన్నారు. 'వందే భారత్ మిషన్' ఐదో దశలో మరింత మంది ప్రవాసులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పూరి వెల్లడించారు.