మంచి మనసుల కథ!

ABN , First Publish Date - 2020-03-02T06:45:20+05:30 IST

మనిషికి మనిషే బరువైపోతున్న ఈ రోజుల్లో ఆ ఏనుగు పిల్లలు తమ ప్రేమను చాటుకుంటున్నాయి. చిన్నప్పుడు ముద్దు చేసిన అమ్మమ్మ మంచానపడితే కంటికి రెప్పలా సాకుతున్నాయి. ఆ ఏనుగుల కథ విన్న...

మంచి మనసుల కథ!

మనిషికి మనిషే బరువైపోతున్న ఈ రోజుల్లో ఆ ఏనుగు పిల్లలు తమ ప్రేమను చాటుకుంటున్నాయి. చిన్నప్పుడు ముద్దు చేసిన అమ్మమ్మ మంచానపడితే కంటికి రెప్పలా సాకుతున్నాయి. ఆ ఏనుగుల కథ విన్న మనుషులు అందరూ పిల్ల ఏనుగులది ‘ఎంత మంచి మనసో’ అంటున్నారు. 

ఈ ఏనుగు పేరు వత్సల. ఈ భూమ్మీద జీవించి ఉన్న ఏనుగుల్లో పెద్ద వయస్కురాలు. 1972లో కేరళ నుంచి మధ్యప్రదేశ్‌కు  తీసుకొచ్చారు. అప్పుడు వత్సల వయసు 45 ఏళ్లు. 1993లో హోషంగాబాద్‌ నుంచి మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్‌ రిజర్వ్‌ (పీటీఆర్‌)కు తరలించారు. అప్పటి నుంచి మూడు దశాబ్దాల పాటు ఏనుగులకు సుఖప్రసవం కావడానికి మంత్రసానిలా, ఒక నర్స్‌లా సాయపడేది. రెండేళ్ల వయసు వచ్చిన పిల్ల ఏనుగులతో పాలు మాన్పించి మేత మేయడం నేర్పిది. 

ఒక్కమాటలో చెప్పాలంటే వత్సల ఏనుగుల మందకు కుటుంబ పెద్దలా ఉండేది. తోటి ఏనుగుల బాగోగులు చక్కగా చూసుకునేది. ‘పిల్ల ఏనుగులపైన వత్సల వాత్సల్యం అపారం’ అని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. 

ఈ మధ్య కాలం దాకా వత్సల బాగానే తిరగగలిగి ఉంది. ముదిమి మీదపడింది. వయసు 90 ఏళ్లకు పైబడింది. ఆరోగ్యం పాడయింది. మేత తిన్నా జీర్ణం కావడం లేదు. కాటారాక్ట్‌ సమస్య తలెత్తి కంటిచూపు బాగా మందగించింది. పాకను వదలి బయటకు రావడం లేదు. ‘వత్సలను అలా వైద్యశాలలో చూడడం మాకు చాలా బాధగా ఉంది’ అంటున్నారు పీటీఆర్‌కు చెందిన పశువైద్యుడు డాక్టర్‌ సంజీవ్‌ గుప్తా. 

మరి ఇట్లాంటి పరిస్థితిలో వత్సల బాగోగులు ఎవరు చూసుకుంటారు అంటే పిల్ల ఏనుగులు ఆ పనిచేస్తున్నాయి.  

మూడేళ్ల వయసున్న బాపూ అనే పిల్ల ఏనుగు, తొమ్మిదేళ్ల మాన్యా, ఎనిమిదేళ్ల ప్రహ్లాద్‌, ఏడేళ్ల కృష్ణకాళీ, ఐదేళ్ల పూర్ణిమలు అమ్మమ్మ వత్సలకు అండగా ఉంటున్నాయి. కళ్లు కనిపించకపోయినా తొండంతో తాకి వత్సల తన మనుమరాళ్లు, మనవళ్లను గుర్తిస్తుంది.

Updated Date - 2020-03-02T06:45:20+05:30 IST