ఆహా ఏమి రుచి...
ABN , First Publish Date - 2020-11-07T05:30:00+05:30 IST
హైదరాబాద్ అనగానే బిర్యానీ గుర్తొచ్చినట్లే.. లక్నో అనగానే కబాబ్లు నోరూరిస్తాయి. వీటితో పాటు ఇంకొన్ని ప్రత్యేక రుచులు కూడా ఈ ప్రాంతాల సొంతం...
మన దేశంలో ఒక్కో ప్రాంతానిది ఒక్కో రుచి. హైదరాబాద్ అనగానే బిర్యానీ గుర్తొచ్చినట్లే.. లక్నో అనగానే కబాబ్లు నోరూరిస్తాయి. వీటితో పాటు ఇంకొన్ని ప్రత్యేక రుచులు కూడా ఈ ప్రాంతాల సొంతం. అలాంటి నాలుగు నాన్వెజ్ రుచులను ఓహ్రీ రెస్టారెంట్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ విక్రమ్ సింహ మీ కోసం అందిస్తున్నారు..
అవద్ కీ గలౌటీ కబాబ్
కావలసినవి
మటన్ (బోన్లెస్) - ఒకకేజీ, ఉల్లిపాయలు - 200గ్రా, వెల్లుల్లి పేస్టు - 100గ్రా, సెనగపిండి - పావుకేజీ, పచ్చి బొప్పాయి పేస్టు - 40గ్రా, గరంమసాలా - 20గ్రా, జీడిపప్పు - 30గ్రా, వేగించిన పుట్నాల పొడి - 25గ్రా, మైదా - 75గ్రా, ఉప్పు - రుచికి తగినంత, లవంగాలు - 10గ్రా, నెయ్యి - 200ఎంఎల్, కశ్మీరీ కారం - 50గ్రా, కుంకుమపువ్వు - 2గ్రాములు.
తయారీ విధానం
- మటన్ను శుభ్రంగా కడిగి మీట్ గ్రైండర్లో వేసి మెత్తగా చేసుకోవాలి.
- తరువాత అందులో వెల్లుల్లి పేస్టు, పుట్నాల పొడి, గరంమసాలా, తగినంత ఉప్పు, కారం, కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి.
- ఉల్లిపాయ, జీడిపప్పును పేస్టు చేసి వేయాలి.
- ఇప్పుడు పచ్చి బొప్పాయి పేస్టు, లవంగాల పొడి వేసి బాగా కలియబెట్టుకోవాలి.
- నెయ్యి రాసిన కవర్ కప్పి రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.
- తరువాత మటన్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న వడల మాదిరిగా ఒత్తుకుని రెండు వైపులా(గ్రిల్) కాల్చాలి.
- షెర్మన్తో వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి.
పచ్చి బొప్పాయిలో
- క్యాలరీలు 43
- ఫ్యాట్ 0.3గ్రా
- ప్రొటీన్ 0.5గ్రా
- కార్బోహైడ్రేట్లు 11గ్రా
పనీర్ దమ్ రోల్
కావలసినవి
పనీర్ - ఒకకేజీ, క్యాబేజీ - ఒక కేజీ, పచ్చి బఠాణీ - 100గ్రా, కారం - 5గ్రా, ధనియాల పొడి - 50గ్రా, కశ్మీరీ కారం - 30గ్రా, పచ్చిమిర్చి - 50గ్రా, నూనె - 200గ్రా, ఉప్పు - రుచికి తగినంత, బ్రెడ్క్రంబ్స్ - 100గ్రా, రవ్వ - 100గ్రా, జున్ను - 250గ్రా, నెయ్యి - 150గ్రాములు.
తయారీ విధానం
- పనీర్ని వెడల్పాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- స్టవ్పై పాన్ పెట్టి నూనె వేయాలి. నూనె కాస్త వేడి అయ్యాక పచ్చిమిర్చి, బఠాణీ వేసి వేగించాలి.
- కాసేపు వేగిన తరువాత తరిగిన క్యాబేజీ వేయాలి. నీరు ఇగిరిపోయేంత వరకు చిన్నమంటపై ఉడికించాలి.
- ఇప్పుడు కారం, రవ్వ, కశ్మీరీ కారం వేసి మరికాసేపు వేగించుకుని దింపాలి.
- మిశ్రమం చల్లారిన తరువాత జున్ను వేసి కలియబెట్టుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని పనీర్ మధ్యలో పెట్టి రోల్ చేసి ఫ్రిజ్లో గంటపాటు పెట్టుకోవాలి.
- తరువాత బయటకు తీసి బ్రెండ్ క్రంబ్స్ అద్దుకోవాలి.
- స్టవ్పై పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ రోల్స్ను అన్ని వైపులా కాల్చాలి.
- చివరగా ధనియాల పొడి చల్లుకుని వేడి వేడిగా వడ్డించాలి.
పనీర్లో...
క్యాలరీలు 293
ఫ్యాటీ 25గ్రా
ప్రొటీన్ 14గ్రా
కార్బోహైడ్రేట్లు 2.97గ్రా
అంబ్రే షియా ముర్గ్
కావలసినవి
చికెన్ (బోన్లెస్) - ఒకకేజీ, పెరుగు - 150గ్రా, నిమ్మరసం - 10ఎంఎల్, అల్లం వెల్ల్లుల్లి - 50గ్రా, జీలకర్ర పొడి - 10గ్రా, గరంమసాలా - 15గ్రా, కశ్మీరీ కారం - 50గ్రా, ఉప్పు - రుచికి తగినంత.
గ్రేవీ తయారీ కోసం
నూనె - 200 ఎం.ఎల్, ఉల్లిపాయ - 50గ్రా, అల్లంవెల్లుల్లి పేస్టు - 15గ్రా, జీలకర్రపొడి - 15గ్రా, పసుపు - 5గ్రా, ధనియాల పొడి - 50గ్రా, గరంమసాలా - 5గ్రా, మెంతి - 5గ్రా, టొమాటో ప్యూరీ - 50గ్రా, జీడిపప్పు - 50గ్రా, వెన్న - 25గ్రా, కొత్తిమీర - 25గ్రాములు.
తయారీ విధానం
- చికెన్ను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- తరువాత పెరుగు, నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు, జీలకర్రపొడి, గరంమసాలా, కశ్మీరీ కారం వేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
- ఓవెన్ను ముందుగానే 260 డిగ్రీసెల్సియస్లో హీట్ చేసుకోవాలి.
- ట్రేపై గ్రీస్ పేపర్ వేసి మారినేట్ చేసిన చికెన్ పెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించాలి.
- గ్రేవీ తయారీ కోసం స్టవ్పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి వేగించాలి.
- జీలకర్రపొడి, పసుపు, ధనియాల పొడి, కశ్మీరీ కారం, మెంతి ఆకులు, గరంమసాలా వేసి కలపాలి.
- పావు గంటపాటు వేగించిన తరువాత టొమాటో ప్యూరీ, జీడిపప్పు పేస్టు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి.
- ఈ గ్రేవీలో చికెన్ ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి.
- చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి దింపాలి.
వందగ్రాముల చికెన్లో పోషకవిలువలు
- క్యాలరీలు 239
- ఫ్యాట్ 14గ్రా
- ప్రొటీన్ 27గ్రా
- కార్బోహైడ్రేట్లు 0
మటన్ లుక్మీ
కావలసినవి
మటన్ కీమా - 200గ్రా, ఉల్లిపాయలు - 20గ్రా, అల్లంవెల్లుల్లి పేస్టు - 10గ్రా, కారం - 15గ్రా, ధనియాల పొడి - 50గ్రా, గరంమసాలా - 5గ్రా, పసుపు - 5గ్రా, నూనె - 400ఎంఎల్, మైదా - 100గ్రా, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - 15గ్రా, నెయ్యి లేదా డాల్డా - 25గ్రా.
తయారీ విధానం
- మటన్ కీమాలో అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి మారినేట్ చేసుకోవాలి.
- స్టవ్పై కడాయి పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు వేసి గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి.
- తరువాత మారినేట్ చేసుకున్న మటన్ వేసి చిన్నమంటపై ఉడికించాలి.
- ధనియాల పొడి, గరంమసాల చల్లి దింపాలి.
- ఇప్పుడు ఒక పాత్రలో మైదాపిండి తీసుకుని అందులో నెయ్యి, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా కలిపి 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
- మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ వెడల్పుగా ఒత్తుకోవాలి.
- మధ్యలో మటన్ మిశ్రమం పెట్టి మరో లేయర్తో మూసేయాలి. నీళ్లు అద్దుతూ చివరలు మూయాలి.
- వీటిని చిన్నమంటపై నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
- వేడి వేడిగా తింటే మటన్ లుక్మీ రుచిగా ఉంటుంది.
మటన్లో..
- క్యాలరీలు 234
- ఫ్యాట్ 11గ్రా
- ప్రొటీన్ 33గ్రా
- కార్బోహైడ్రేట్లు 0.1గ్రా
విక్రమ్ సింహ
కార్ప్ చెఫ్, ఓహ్రిస్