అంతా శుభం.....ఎప్పుడో!
ABN , First Publish Date - 2020-05-09T05:30:00+05:30 IST
‘‘కరోనా సమాజంలోని అన్ని వర్గాలపై తన ప్రతాపం చూపుతోంది. లాక్డౌన్ కాలంలో పేద పురోహితులు కష్టాల పాలవుతున్నారు.
‘‘కరోనా సమాజంలోని అన్ని వర్గాలపై తన ప్రతాపం చూపుతోంది. లాక్డౌన్ కాలంలో పేద పురోహితులు కష్టాల పాలవుతున్నారు. సాధారణ రోజుల్లో పురోహితులు రోజుకు కనీసం 500 రూపాయలు సంపాదించేవాళ్లు. ఇప్పుడు పైసా కూడా సంపాదన లేక ఆకలితో, ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఎవరినీ దానం చేయమని అడగలేని స్థితి వారిది. లాక్డౌన్ వల్ల పూజలు, శుభకార్యాలు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దేవాలయాలు మూసివేయడం వల్ల అర్చకుల స్థితి దీనంగా మారింది. ప్రభుత్వ దేవాదాయ శాఖ కింద ఉన్న పురాతన దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద నెలకు కొన్ని నిధులను ప్రభుత్వం ఇస్తోంది. కానీ దేవాదాయ శాఖ పరిధిలోకి రాని ప్రైవేటు గుడుల మీద ఆధారపడిన పురోహితుల కుటుంబాల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
మే, జూన్ మాసాలలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు శుభ ముహూర్తాలున్నాయి. కానీ లాక్డౌన్ అడ్డొచ్చింది. దీంతో పురోహితులు సంపాదనను కోల్పోయారు. జూలై తర్వాత శుభ ముహూర్తాల్లేవు. కార్తీకమాసంలో శుభ ముహూర్తాలు ఉన్నా జనవరి నుంచి మార్చి వరకూ గురుపౌఢ్యమి కారణంగా శుభకార్యాలు నిర్వహించరు. అలా ఈ ఏడాదంతా పురోహితులకు గడ్డు కాలమే. అందుకనే పేద పురోహితులను ఆదుకోవడానికి ‘ధర్మరక్షణ’ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకొచ్చారు. వారి చేయూతతో పేద పురోహితులకు కొంత ఆర్థిక సహాయం చేయడం ప్రారంభించాం. ఇప్పటిదాక 40 పేద పురోహిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ ఐదువేల రూపాయల చొప్పున సహాయం చేశాం. పూజారులు, పేద పురోహితుల వివరాలను సేకరించి వారి అకౌంట్లు, ఫోన్ నంబర్లను దాతలకు ఇస్తాం. హైదరాబాద్లో 200 మంది పైగా పూజారులు, వారి బ్యాంక్ అకౌంట్ నంబర్లను సేకరించాం. దాతలకు వారి వివరాలను అందజేస్తున్నాం.
కరోనా వల్ల కొంత మంచి కూడా జరిగింది. జనాల్లో సాయం చేసే గుణం పెరిగింది. వైద్యపరంగా, సామాజిక అవసరాలరీత్యా ఎక్విప్మెంట్, సాంకేతిక పరిజ్ఞానం ఊపందుకుంది. పెళ్లిళ్లలకు, ఫంక్షన్లకు చేసే ఆడంబర ఖర్చులు ముందు ముందు తగ్గుతాయి. కట్న కానుకల విషయంలో కూడా ధోరణి మారుతుంది. ఏ విలువలు లేకుండా బతకడం కన్నా విలువలతో కూడిన జీవితాన్ని ప్రజలు ఇప్పుడు స్వాగతిస్తున్నారు.’’
శ్రీనివాస్ మాధవ్
ధర్మరక్షణ సమితి