ఈ కోకిల పిచ్చుకలకు గూడు కడుతోంది!
ABN , First Publish Date - 2020-07-29T05:30:00+05:30 IST
తెల్లారగానే ఇంటి వాకిళ్ళలో కిచకిచమంటూ సందడి చేసే పిచ్చుకలను చూసి ఎన్నాళ్ళయింది? ఆధునికత తెస్తున్న మార్పులు పిచ్చుకల పాలిట బ్రహ్మాస్త్రాలుగా మారడంతో ఆ జాతి క్రమేపీ కనుమరుగైపోతోంది....
తెల్లారగానే ఇంటి వాకిళ్ళలో కిచకిచమంటూ సందడి చేసే పిచ్చుకలను చూసి ఎన్నాళ్ళయింది? ఆధునికత తెస్తున్న మార్పులు పిచ్చుకల పాలిట బ్రహ్మాస్త్రాలుగా మారడంతో ఆ జాతి క్రమేపీ కనుమరుగైపోతోంది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో... పూర్తిగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న పిచ్చుకలను పరిరక్షించడానికి కృషిచేస్తున్నారు మైసూరుకు చెందిన కోకిలా రమేశ్ జైన్. వాటికి గూడూ, నీడా కల్పిస్తున్నారు. ఈ లాక్డౌన్ కాలంలో కూడా గూళ్ళను సిద్ధం చేశారు. ఈ విభిన్న కార్యక్రమం గురించి ఆమె ఏమంటున్నారంటే...
‘‘ఒక రోజు న్యూస్ పేపర్లో ఒక కథనం చదివాను. కొన్నేళ్ళుగా పిచ్చుకలు మన సమాజంలో నుంచి క్రమంగా అదృశ్యం అవడానికి కారణాలను అందులో రాశారు. నా మనసు చివుక్కుమంది. నా చిన్నప్పుడు ఇళ్ళలోకి పిచ్చుకలు స్వేచ్ఛగా వచ్చేవి. ఇంట్లో ఏ మూలో చూరుల్లో గూళ్ళు కట్టుకొని బతికేవి. ఇప్పుడు వాటిని చూద్దామన్నా కనిపించడం లేదు. ‘ఆ జాతి అంతరించి పోకుండా కాపాడాలంటే ఏం చెయ్యాలి?’ అనే ఆలోచన నన్ను వెంటాడింది. అడవులు అంతరించిపోతున్నాయి. వాతావరణ కాలుష్యం పెరిగింది. దీనికితోడు సెల్ టవర్ల నుంచి విపరీతమైన రేడియేషన్. ఇక ఇళ్ళ నిర్మాణంలో వస్తున్న మార్పుల కారణంగా పిచ్చుకలు గూళ్ళు కట్టుకోవడానికి చోటు దొరకడం లేదు. మరోవైపు పంటల మీద రసాయనాల వాడకం పెరిగింది. ఇవన్నీ పిచ్చుకలు నానాటికీ తగ్గిపోవడానికి కారణాలవుతున్నాయి. కాబట్టి వాటికి ఆహారం, గూడు కల్పించాలి. పక్షుల సంరక్షణ కోసం నేను స్థాపించిన ‘జీవ దయా జైన్ ఛారిటీ’ (జె.డి.జె.సి.) ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టాను.
అవసరాన్ని గుర్తించి, అవగాహన పెంచి...
ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో నివసిస్తున్నవారినీ, సంస్థలనూ కలిశాను. పిచ్చుకల సంరక్షణ గురించి వాళ్ళతో మాట్లాడాను. పూర్వం పల్లెటూళ్ళలో ఇంటి చూర్లకు ధాన్యం కంకులు వేలాడదీసేవారు. వాటిని తిని పిచ్చుకలు కడుపు నింపుకొనేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఇళ్ళ దగ్గరా, భవనాల ముందూ చిన్న గిన్నెల్లో నీరూ, ఆహారం ఉంచాలని వారిని కోరాను. అలాగే మైసూరులోని దేవరాజ మార్కెట్లో నేనూ, మా బృందం సర్వే జరిపాం. ‘‘మా ప్రాంతంలో పిచ్చుకలనేవే లేవు. మీరు ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు’’ అని దుకాణదారులు చెప్పారు. వారి ఆలోచన మార్చడానికి మేము ప్రయత్నించాం. పక్షుల జీవన విధానం, వాటి ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రచారం చేశాం. పిచ్చుకల పరిరక్షణకు వారిలో చాలామంది ముందుకు వచ్చారు. పిచ్చుకలంటే మాకూ ఇష్టమే. కానీ వాటిని సంరక్షించుకోవాలంటే మా దుకాణాల దగ్గర గూళ్ళు ఉండాలి కదా! అన్నారు వాళ్ళు. పక్షుల విలువను వాళ్ళు అర్థం చేసుకున్నందుకు నాకు ఆనందం కలిగింది.
పిచ్చుకలను బాగా ఆకర్షించేలా గూళ్ళు రూపొందించడం పెద్ద పనయ్యింది. వాటిని నేనే డిజైన్ చేశాను. వాటిని టెర్రాకోటాతో తయారు చేశాను. దుకాణదారులకూ, పౌరులకూ కిందటి ఏడాది అయిదు వందలకు పైగా పిచ్చుక గూళ్ళు, అవి నీరు తాగడానికి అనువైన మరో అయిదు వందల సీసాలూ మా సంస్థ తరఫున ఉచితంగా పంపిణీ చేశాం. ఇది మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఈ ప్రయత్నం ఫలించదన్న వాళ్ళే మూడు నెల తరువాత, గూళ్ళలోకి పక్షులు రావడం చూసి సంబరపడుతున్నారు.
ఫీడింగ్ స్టేషన్ల ఆలోచన...
నగర శివారు ప్రాంతాల్లో పిచ్చుకలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. అలాంటి ప్రాంతాల మీద అధ్యయనం మొదలుపెట్టాం. అక్కడ ఆ పక్షులకు గూళ్ళు ఏర్పాటు చేస్తున్నాం. మైసూరులోని వివిధ ప్రాంతాల్లో వాటి కోసం ఫీడింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. అలాగే పండ్ల చెట్లు, పూల చెట్లు నాటడానికీ ప్రయత్నిస్తున్నాం. తద్వారా వాటికి సహజమైన ఆహారం దొరుకుతుంది. పక్షులు ధాన్యం, బియ్యం, గింజ ధాన్యాల మిశ్రమం తింటాయి. ఇవన్నీ కలిపి, గూళ్ళు, ఫీడింగ్ బాటిల్స్తో పాటు ఒక కిట్గా మేము పంపిణీ చేస్తున్నాం. పక్షుల పెంపకంపై ఆసక్తి ఉన్నవారెవరైనా మాతో పాటు కలిసి పని చెయ్యవచ్చు. గూళ్ళ ఏర్పాటులో పాలు పంచుకోవచ్చు.’’
లాక్డౌన్లో ఇలా..
‘‘నేను జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మైసూర్ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిని. జె.డి.జె.సి.కి వ్యవస్థాపకురాలిని. జంతు సంరక్షణ కోసం పాటుపడే అనేక సంస్థలతో కలిసి పనిచేస్తున్నా. ఈ పనులతో ఎంతో బిజీగా ఉంటాను. కానీ కరోనా వ్యాప్తి కారణంగా విధించిన లాక్డౌన్లో నాకు తీరిక దొరికింది. నూట యాభై పిచ్చుకల కోసం గూళ్ళు తయారు చేశాను. వాటిని త్వరలోనే పంపిణీ చేస్తాను. అలాగే వీధుల్లో తిరిగే జంతువులను ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా సంరక్షించాలో ‘జూమ్’ ద్వారా పశు వైద్య నిపుణులతో కలిసి ఈ మధ్య సూచనలు కూడా అందించాను.’’


