సత్యం కోసం‌ పయనించిన శంకరులు

ABN , First Publish Date - 2020-04-28T15:50:12+05:30 IST

స్వచ్ఛమైన తాత్త్వికత దృష్ట్యా భారత భూమిపై భగవద్విషయక పరిగణలకు అతీతంగా ఆది శంకరాచార్యుల సిద్ధాంతం అతి ముఖ్యమైనది (లేదా అవసరమైనది), మనోహరమైనది. వారి సిద్ధాంతాలకు వ్యతిరేకమైన వేదాంత ధోరణులూ, సంప్రదాయాలూ వారి సిద్ధాంతంలోని సాహసోపేతమైన గాంభీర్యానికి, విచారణా సూక్ష్మతకు సాటిరావు” అని భారతీయ తత్త్వశాస్త్ర పరిశీలకులైన జర్మనీ దేశపు జార్జ్ టిబో (George Thibaut) ఆది శంకరాచార్య గుఱించి అన్నారు. ఇవాళ ఆది శంకరుల జయంతి‌. ఈ సందర్భంగా ఆచార్యుల వారిని తలుచుకుందాం రండి

సత్యం కోసం‌ పయనించిన శంకరులు

"స్వచ్ఛమైన తాత్త్వికత దృష్ట్యా భారత భూమిపై భగవద్విషయక పరిగణలకు అతీతంగా ఆది శంకరాచార్యుల సిద్ధాంతం అతి ముఖ్యమైనది (లేదా అవసరమైనది), మనోహరమైనది. వారి సిద్ధాంతాలకు వ్యతిరేకమైన వేదాంత ధోరణులూ, సంప్రదాయాలూ వారి సిద్ధాంతంలోని సాహసోపేతమైన గాంభీర్యానికి, విచారణా సూక్ష్మతకు సాటిరావు” అని భారతీయ తత్త్వశాస్త్ర పరిశీలకులైన జర్మనీ దేశపు జార్జ్ టిబో (George Thibaut) ఆది శంకరాచార్య గుఱించి  అన్నారు. ఇవాళ ఆది శంకరుల జయంతి‌. ఈ సందర్భంగా ఆచార్యుల వారిని తలుచుకుందాం రండి -


 ఈ‌ వ్యావహారిక‌‌ శకానికి పూర్వం (BCE) 509లో శంకరులు పుట్టారు అని ప్రధానమైన శంకరమఠాల గురు పరంపర ద్వారానూ, శంకరాచార్యులు స్థాపించిన పీఠాల చరిత్ర ద్వారానూ తెలియవస్తోంది.  వారి కాలంలో  సనాతన ధర్మానికీ, భారతప్రదేశానికీ హిందూ పదం ఆపాదించబడలేదు. అందుకే వారి రచనలలో ఎక్కడా హిందూ అన్న పదం మనకు కనిపించదు.‌ మనం చదివినట్లుగా వారి జననం వ్యావహారిక(CE) శకం 788 అయి ఉంటే అప్పటికి హిందూ పదం చలామణిలోకి వచ్చింది కాబట్టి వారి రచనల్లో ఎక్కడైనా హిందూ పదం కనిపించి ఉందేది. 6వ శతాబ్దికి చెందిన న్యాయ‌ సిద్ధాంత తాత్త్వికుడు ఉద్యోతకార. శంకరులు ఈయన ప్రసక్తి  చెయ్యలేదు. 5వ శతాబ్దికి చెందిన  ప్రముఖ బౌద్ధ‌ పండితుడు దిన్నాగ.  దిన్నాగ ప్రసక్తి కూడా శంకరులు చెయ్యలేదు. అంటే శంకరుల కాలం వీళ్లకు పూర్వంది. వ్యావహారిక శకం 700 -750 కాలం నాటి సంస్కృత నాటకకర్త భవభూతి శంకరుల  వివర్త వాద ప్రసక్తి చేశాడు. అంటే అప్పకి శంకరులు చాలా పూర్వం వారని తెలుస్తోంది. వ్యావహరిక శకానికి పూర్వం 5వ శతాబ్దికి చెందిన గౌతమ‌బుద్ధుడి ప్రసక్తి కూడా ఎక్కడా శంకరులు‌ చెయ్యలేదు. శంకరుల కాలానికి ఉన్న వివిధ‌ స్వదేశీ‌ మతాల్లో‌‌‌ బౌద్ధమతం‌ లేదు. అంటే శంకరులు బుద్ధుడి కన్నా పూర్వం వారు అన్నది కూడా స్పష్టమౌతున్నది.


 ఆది శంకరాచార్య భారతావనిపై పుట్టి జీవించింది 32 సంవత్సరాలే! శంకరులు వైశాఖ శుక్ల పంచమినాడు కాలడి‌ (ప్రస్తుత కేరళ రాష్ట్రం) గ్రామంలో శివగురువు,‌ ఆర్యాంబ దంపతులకు జన్మించారు. శంకరులు బాల్యం నుంచే అపూర్వ, అద్వితీయ వ్యక్తిత్వంతో, ధీ శక్తితో ఎదిగారు. అనితరసాధ్యమైన మేధతో 16 ఏళ్లకే తమ ఇతర‌ రచనలతో పాటు ప్రస్థానత్రయమైన దశోపనిషత్తులూ, బ్రహ్మసూత్రాలూ, భగవద్గీతలకు భాష్యాలు వ్రాసేశారు. నిజానికి భగవద్గీతకు అంతకు ముందే భాష్యాలు ఉన్నా శంకరుల భాష్యం తరువాతే భగవద్గీత వ్యాప్తికి వచ్చింది. ప్రస్థానత్రయాన్ని శంకరులు తమ భాష్యాలతో జనబాహుళ్యంలోకి‌‌ తీసుకువచ్చారు. ఆది శంకారాచార్య వేఱు, వేఱు దేవతలపై 64 స్తోత్రాలూ, 37 ప్రకరణ గ్రంథాలూ వ్రాసి మనకందించారు. 


వక్రపు వ్యాఖ్యానాలతోనూ, వక్రపు ధోరణులతోనూ, దోష సంప్రదాయాలతోనూ సనాతన ధర్మం‌‌ అస్తవ్యస్తమైన కాలంలో ఆది శంకరాచార్యులు  వేదప్రతిపాదిత సత్యాన్ని సంస్థాపించడానికి పూనుకుని ఉద్యమించారు.  కృతకృత్యులూ అయ్యారు. తాత్త్విక, సామాజిక, ఆధ్యాత్మిక చింతనలతో  విశేషంగా కృషిచేశారు వారు.  ఆది శంకరాచార్యులు తమ అసమాన బహుముఖ ప్రజ్ఞతో, విప్లవాత్మక ధోరణితో ఆనాడు సమాజంలో పాతుకుపోయి ఉన్న  సామాజిక,‌ సైద్ధాంతిక, మత మౌఢ్యంపై తిరుగుబాటు చేసి విజయం‌ సాధించారు. వేద ప్రతిపాదిత అద్వైత సిద్ధాంతాన్ని మళ్లీ ప్రసరింపజేశారు,‌ ప్రవహింపజేశారు. 


ఒక విస్మయకరమైన మేధావి, ఒక జ్ఞాని, ఒక పూజనీయమైన ఆచార్యుడు, ఒక భక్తుడు, ఒక కర్మ యోగి, ఒక వివేకి, ఒక పండితుడు,‌ ఒక దార్శనికుడు, ఒక సంస్కర్త‍‍, ఒక ఆధ్యాత్మిక యోగి, ఒక సిద్ధుడు‍, ఒక‌ మహాకవి. ఒక ముముక్షువు, ఒక మార్మికుడు,‌ ఒక తత్త్వవేత్త, ఒక తార్కికుడు, ఒక‌ అద్వైతి, ఒక భాష్యకారుడు, ఒక ఉద్యమ కారుడు, ఒక విప్లవశీలి, ఒక సనాతన ధర్మనిర్మాత ఆది శంకరాచార్య. వారి నుడి‌ తత్త్వానికి బడి, ఆపై సత్యానికి గుడి. మనందఱికీ వారే ఒరవడి. శంకరత్వాన్ని సరిగ్గా‌‌ స్మరించుకుందాం‌‌ ఇదిగో‌‌‌ ఇలా ...


"ఏవమాత్మా రణౌ ధ్యానమథనే సతతం‌‌ కృతే / ఉదితాన గతి ర్జ్వాలా సర్వాజ్ఞానేంధనం దహేత్" (ఆత్మబోధ 42వ శ్లోకం) అంటే ఆత్మే ఒక ఆరణి (నిప్పును రగిలించేందుకు ఉపయోగించే జమ్మి చెట్టు‌ కఱ్ఱ)కాగా, నిరంతర ధ్యానమే మథనం కాగా ఆందులోంచి పుట్టిన జ్వాలలో మొత్తం అజ్ఞానం అనే ఇంధనం దహించుకుపోతుంది అని అర్థం.‌ ఎంత అద్భుతంగా చెప్పారు శంకరులు? "సత్యాపి భేదాపగ్మే నాథ్ తవాహం న మామ్ కీనస్త్వమ్ / సాముద్రో హి తరంగః క్వచన్ సముద్రో న తారంగః" (విష్ణుష్టపదీ శ్లోకం 3) అంటే నేను భిన్నత్వానికి లోబడినా నాథా,  నేను నీవాణ్ణి. కానీ నువ్వు నా వాడివి కాదు అన్నది‌ నిజం‌. కెరటాలు సముద్రానికి చెందినవి కావచ్చు‌. కానీ సముద్రం కెరటాలకు సంబంధించినది కాదు అని అర్థం. ఇక్కడ శంకరులు ఒక మహోన్నతమైన విషయ వివరణ చేశారు. "స్వప్నో జాగరణేSలీకః స్వప్నేSపి నహి జాగరః / ద్వయమేవ లయే నాస్తి లయోSపి హ్యు భయోర్న చ"(అపరోక్షానుభూతి- శ్లోకం 57) అంటే మెలకువలో కల లేదు. కలలో  మెలకువ లేదు. ఈ‌‌ రెండూ మరణం‌(లయ)లో‌ లేవు. ఈ మరణం మెలకువలోనూ, కలలోనూ లేదు అని అర్థం.‌ అహా, అత్యున్నతమైన విషయాన్ని అసదృశంగా చెప్పారు శంకరులు!



"జ్ఞానం‌ లేకపోతే స్వేచ్ఛ లేదు. అగ్ని లేకపోతే వంట లేనట్లుగా" (ఆత్మబోధ‌- శ్లోకం 2). "విద్య అవిద్యను పోగొడుతుంది‌‌. తేజస్సు మాత్రమే అంధకారాన్ని పోగొట్టగలిగినట్లు". (ఆత్మబోధ- శ్లోకం 3) "నీళ్లలో బుడగలు పుడతాయి. కాసేపు నీళ్లపై  ఆడతాయి. ఆ తరువాత నీళ్లలోనే కలిసిపోతాయి". (ఆత్మబోధ- శ్లోకం 8) ఈ విధమైన రచనం మనకు కవులు రూమీలోనూ, ఖలీల్ జిబ్రాన్ లోనూ కనిపిస్తుంది. "పైన ఉన్న ఊకను తీసేస్తే బియ్యపు గింజ చక్కగా తెలుస్తుంది". (ఆత్మబోధ - శ్లోకం16) ఈ చెప్పడం ఎంత సహజంగా ఉందో? ఈ ఉపమానంలో జీవనం కనిపిస్తోంది కదూ?

"దీపానికి ఇంకో దీపం అక్కర్లేదు  తనే ప్రకాశిస్తుంది కాబట్టి".(ఆత్మ‌బోధ . శ్లోకం 29) ఈ ధోరణి మనకు కవి రూమీలో కూడా కనిపిస్తుంది‌. "రోగాన్ని ఔషధం ఏ విధంగా పోగొడుతుందో ఆవిధంగా". (ఆత్మబోధ- శ్లోకం 37)  సహజమైన ఉపమ‌‌ ఇది!  ఇలాంటివి కవి లావ్ ట్సూ లోనూ  కనిపిస్తాయి. "నీళ్లలో నీళ్లు లాగా, ఆకాశంలో‌ ఆకాశం లాగా, తేజస్సులో తేజస్సులాగా" (ఆత్మబోధ- శ్లోకం 53)

ఈ అనడం ఎంత గొప్పగా ఉందో కదా?‌ రూమీ, ఖలీల్ జిబ్రాన్, లావ్ ట్సూ వంటి కవుల్లో ఈ ధోరణి ఉన్నది. "పాలలో వెన్న అంతటా వ్యాపించి ఉంటుంది" (ఆత్మబోధ- శ్లోకం 59) ఇక్కడ

"పచ్చిపాలలోన వెన్న పరమాత్ముడు" అని అన్నమయ్య అన్నదానికి మూలం ఇదే..

"అగ్నిలో కాలుతున్న ఇనుము అగ్నిలాగానే ప్రకాశించినట్లు" (ఆత్మబోధ-‌శ్లోకం 62) ఈ చెప్పడం ఎంతో అద్భుతంగా ఉంది! ఈ స్థాయి‌‌ మాటలు‌ శంకరులు ఎన్నో అన్నారు.


"ఎవరు నీ భార్య? ఎవరు నీ కొడుకు? ఈ సంసారం చాలా విచిత్రమైనది. నువ్వెవరివి? ఎక్కణ్ణుంచి వచ్చావు? తమ్ముడూ, ఆ విషయం గుఱించి‌ ఇప్పుడు ఆలోచించు. ( 8 వ శ్లోకం మోహముద్గరం‌ లేదా  భజగోవిందం‌ శ్లోకాలు) కవి‌ ఖలీల్ జిబ్రాన్  "your children are not your chidren" అని అనడానికి వందల ఏళ్ల క్రితమే శంకరులు ఈ మాటలు అన్నారు.

"నీ ధనం, నీ పరివారం, నీ యవ్వనం వీటితో గర్వించకు. అవి నిమిషంలో నశిస్తాయి. అవి మాయ. అది తెలుసుకుని బ్రహ్మ‌ పథంలోకి ప్రవేశించు.‌ (11వ శ్లోకం భజగోవింద‌ం‌ శ్లోకాలు) ఇలా అంటూ శంకరులు మనల్ని కదిలిస్తారు.


"ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృ కుక్షౌ స్థితం మాం

విణ్మూత్ర మేధ్య మధ్యేక్కథ యతి‌ నితరాం జాఠరో జాతవేదాః

యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం".(శివాపరాథ క్షమాపణ స్తోత్రం.‌‌ శ్లోకం 1)  అంటే మొదట్లో కర్మ అవసరం వల్ల (లేదా కర్మ విస్తరణ వల్ల) కలుషితమై‌న తల్లి కడుపులో ఉండేవాణ్ని నేను. మలమూత్రాలు, కడుపులోని వేడి, ఇతరమైనవి ఏవైతే ఉన్నయో వాటివల్ల కలిగిన దుఃఖం, వ్యథల్ని ఇతరులు చెప్పడం ఎలా సాధ్యమౌతుంది? అని అర్థం. "గర్భంలోని శిశువు దుఃఖాన్ని , వ్యథను ఎవరు‌ చెప్పగలరు?"‌ ఈ భావన చేసిన‌‌ తొలి కవి, తాత్త్వికులు ఆది‌శంకరాచార్యులే. లావ్ ట్సూ , రూమీ, ఖలీల్ జిబ్రాన్ , షెయ్ క్స్ పియర్ వంటి కవులెవ్వరూ ఇలాంటి‌ లేదా ఈ‌ స్థాయి చింతన,‌ భావన చెయ్యలేదు. ఇలాంటి‌‌‌ రచన‌‌‌, చింతన ఇది ఒక్కటే!


"దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరలతరంగే" (గంగా స్తోత్రం - శ్లోకం 1) ఆది‌శంకరులు తమ‌ గంగా స్తోత్రంలో గంగా‌‌ నదిని "తరల‌తరంగే‌" ‌అన్నారు. "తరలం" అంటే కదిలేది, ప్రకాశించేది,‌ అనురాగం ఉన్నది, హారం మధ్యలో ఉండే ప్రధాన రత్నం, వజ్రం అని అర్థాలు. ఒక్క మాటతో గంగా నది గుఱించి చెప్పేశారు. ఇలా ఒక్క మాటతో వస్తువుపై సరైన అవగాహన కలిగించడం ఒక మహాకవి లక్షణం. ఆ గంగా‌ నదిని (వసుధాహారం) "భూమికి‌ హారం" అన్నారు. ఇది శంకరుల భవ్య‌మైన భావుకత.


ప్రశ్నోత్తర రత్నమాలికలో అడగబడ్డ కొన్ని ప్రశ్నలకు శంకరులు ఇచ్చిన‌ జవాబులు మనకు దిశా నిర్దేశం చేస్తాయి.‌ ఆలకించండి ... 


ఏది అన్నిటికన్నా  ప్రయోజనకరమైనది?

జవాబు: ధర్మం 

ఏది వాంఛింపదగినది?

జవాబు: స్వ, పర హితం. 

శత్రువు ఎవరు?

జవాబు: సోమరితనం.

ఏది దుఃఖం?

జవాబు: ఉత్సాహం‌ లేకపోవడం.

ఏది‌ జాడ్యం?

జవాబు:‌ నేర్చుకున్నది ఆచరించకపోవడం.

ఏది వెలలేనిది?

జవాబు: అవసరం వచ్చినప్పుడు ఇవ్వబడేది.

ఎవరి చేత ప్రపంచం జయించబడుతుంది?

జవాబు: సత్యం, ఓర్పు ఉన్న వ్యక్తి చేత.

 ఏది దానం?

జవాబు: అకాంక్ష లేనిది.

ఎవరు స్నేహితులు?

జవాబు: పాపాన్ని నివారించే వాళ్లు‌.

ఏది పాతకం?

జవాబు:‌ హింస.

ఎవరు ఎదుగుతారు?

జవాబు: వినయం ఉన్నవాళ్లు. 

ఎవరు ప్రత్యక్ష దేవత?

జవాబు: అమ్మ.

వేటిని మనుషులు సంపాదించాలి?

జవాబు: విద్య, ధనం, బలం, కీర్తి , పుణ్యం.

వేటిని కాపాడుకోవాలి?

జవాబు:‌ కీర్తి , పతివ్రత, బుద్ధి 

ఎవరు శూరులు?

జవాబు: భయంతో ఉన్నవాళ్లను రక్షించేవాళ్లు.


ఆది శంకరాచార్యులు తమ సౌందర్యలహరి 75వ శ్లోకంలో తమను తాము "ద్రావిడ శిశు" అని‌ ప్రకటించుకున్నారు. ఆ శ్లోకం: "తవ స్తన్యం మన్యే తుహినగిరి కన్యే హృదయతః/పయఃపారావారః పరివహతి సారస్వత మివ / దయావత్యా దత్తం ద్రవిడశిశు‌రాస్వాద్య తవ యత్ / కవీనాం ప్రౌఢానా నుజని‌ కమనీయః కవయితా".  శంకరులు సామాజిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు అంటే వారు ఆర్యులు అయుండాలి కదా? పైగా సంస్కృతంలో వ్రాశారు. సంస్కృతం ద్రావిడుల భాష కాదని కదా మనం‌‌ చదువుకున్నది?. ఇక్కడ ఆర్యులైన శంకరులు  సంస్కృతంలో తమను తాము‌ ద్రావిడశిశు‌‌ అని ప్రకటించుకుంటున్నారు! అదేంటి?‌  నిజమేమిటంటే,  "శంకురుల కాలానికి మన దేశంలో ఆర్య‌ ద్రావిడులు అన్నది లేదు". నిజానికి ఆర్య అన్న జాతి ఎప్పుడూ లేదు. ద్రావిడ అంటే దక్షిణభూభాగానికి సంబంధించిన అని అర్థం. ద్రావిడ అన్నది ప్రదేశాన్ని సూచించేది. ఆర్య అన్నది జాతిని సూచించేది కాదు. అర్య అన్నది గొప్పవాళ్లను సంబోధించే పదం అయ్యా , మహాశయా అన్నట్లుగా. శంకరుల ఈ శ్లోకం వల్ల ఆర్య ద్రావిడ జాతులు అన్నవి నిజం కాని అభూత కల్పనలు అని‌ తెలియవస్తున్నది.‌ ("Aryan invasion is an abandoned theory"  అని Oxford Reference Dictionary కొన్నేళ్ల క్రితం తేల్చి చెప్పింది) ఈ శ్లోకానికి‌ అర్థం : హిమగిరి పుత్రికా (పార్వతీ), నీ స్తన్యం హృదయం నుంచి పుట్టినదైన పాల కడలి.   సారస్వతం (సరస్వతికి‌ సంబంధించినది) దాని నుంచే ప్రవహిస్తోందని తలుస్తున్నాను (అనుకుంటున్నాను).‌ఆ స్తన్యాన్ని ఈ ద్రవిడ శిశువు తాగి ప్రౌఢ కవులలో కమనీయమైన కవిగా పుట్టాడేమో? అద్భుతమైన భావుకతనూ, రచనా‌ సంవిధానాన్నీ‌ చూపారు ఇక్కడ శంకరులు‌. ఇవాళ ప్రపంచంలో గొప్ప కవిత్వాన్నిచ్చిన కవులుగా ఎక్కువగా చదవబడుతున్న లావ్‌ట్సూ , రూమీ, ఖలీల్ జిబ్రాన్, షెయ్ క్స్ పియర్‌ల రచనా సంవిధానం పుష్కలంగా శంకరులలో తొణికిసలాడుతూంటుంది. నిజానికి‌ వీళ్లే కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్, శ్రీశ్రీ , వంటి కవులు కూడా శంకరుల కవితా రచనా‌‌ పరిధిలోని వాళ్లే!




వివేక చూడామణి. ఆది‌ శంకరాచార్య కృతులలో ఈ వివేకచూడామణి అత్యున్నతమైనది. ఈ విషయకంగా దీనికి సరిపోలగల రచన విశ్వంలో మఱొకటి లేదు. ప్రస్థానత్రయం తరువాత మన భూమిలో పుట్టిన మహోన్నతమైన రచన ఇది. ఆ‌‌ వివేక చూడామణి (శ్లోకం‌ 63)లో ‌"అజ్ఞాన సర్ప‌దష్టుడైన (శ్రీశ్రీ‌ బాధాసర్ప దష్టులారా,‌ అనడానికి శంకరుల‌‌ ఈ ప్రయోగమే మూలం) వాడికి బ్రహ్మజ్ఞాన ఔషధం తప్పితే వేదాల వల్ల ఏం ప్రయోజనం?, శాస్త్రాలవల్ల ఏం ప్రయోజనం?, మందుల వల్ల ఏం ప్రయోజనం?‌‌ అనీ, (శ్లోకం‌ 64లో)

"మందుల పేర్లవల్ల కాదు వాటిని‌ సేవిస్తే తప్ప వ్యాధి పోదు‌‌. స్వానుభవం‌ (అపరోక్షానుభవం) తప్పితే బ్రహ్మం, పేరు (శబ్దం) వల్ల నివృత్తి కాదు" అనీ తెలియజెప్పప్పడం వారి ప్రత్యేకతనూ,‌ ఔన్నత్యాన్నీ , దార్శనికతనూ తెలియజేస్తోంది.


ఆది శంకరాచార్య ఒక సర్వజ్ఞ. "మీకు చెప్పులు కుట్టడం వచ్చా"  అని అడిగినప్పుడు శంకరులు చెప్పును రెండుపాదాల మధ్యలో పెట్టకుని సూదిని‌ ముక్కు‌ పక్కభాగంలో రుద్దుకుని చెప్పు కుట్టారట‌. ఇలా సూదిని ముక్కు పక్కన రుద్దడం‌ వృత్తిగా చెప్పులు కుట్టే వాళ్లు చేస్తారు. శంకరులు మడికట్టుకుని కూర్చోలేదు. వీధిలోకి‌ వచ్చి ఉద్యమించారు. వారిని చంపాలని ప్రయత్నాలూ జరిగాయి. అయినా‌ భయపడకుండా సత్యం కోసం‌ పయనించారు, పని చేశారు. 


"ఆది శంకరాచార్యుల వారికి సాటిరాగల మానవ మూర్తమత్వం ఈ విశ్వంలో మఱొకటి లేనేలేదు"


ఇవాళ ఆదిశంకరాచార్య జయంతి. ఈ‌  సందర్భంగా- ఆ మహాశక్తికి,‌ ఆ సనాతన అభివ్యక్తికి; ఆ ఆధ్యాత్మిక సూర్యుడికి, ఆ తాత్త్విక కాంతికి; ఆ‌ విశ్వమహాకవికి, ఆ భవ్య సాహిత్యానికి; ఆ విశేషనైజానికి, ఆ విశిష్ట వైప్లవ్యానికి; ఆ ధర్మజ్ఞతకు, ఆ దార్శనికతకు;  ఈ మట్టి మనుషులంగా మనసా, వాచా ప్రణామం చేద్దాం. 


"శంకరత్వం ఒక‌ సుజ్ఞాన సత్వం

సదా అనుగమించాల్సిన తత్త్వం"


రోచిష్మాన్

9444012279

rochishmon@gmail.com


Updated Date - 2020-04-28T15:50:12+05:30 IST