కొత్తరకం కౌంటర్!
ABN , First Publish Date - 2020-10-01T05:30:00+05:30 IST
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన స్వీట్ షాపు యజమాని ఎ. విఘ్నేశ్ సామాజిక దూరాన్ని పాటించడమే కాకుండా వినూత్న మార్గంలో తన ఉత్పత్తులను అమ్ముతున్నారు...
కరోనా వైరస్ సోకకుండా చాలా చోట్ల సామాజిక దూరం పాటిస్తుండడం మానం చూస్తూనే ఉన్నాం. కానీ తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన స్వీట్ షాపు యజమాని ఎ. విఘ్నేశ్ మాత్రం ఓ అడుగు ముందుకేశారు. సామాజిక దూరాన్ని పాటించడమే కాకుండా వినూత్న మార్గంలో తన ఉత్పత్తులను అమ్ముతున్నారు.
కోయంబత్తూరులోని రత్నపురిలోని తన షాపులో విఘ్నేశ్ బ్రెడ్ ప్యాకెట్లు తయారుచేస్తున్నాడు. అక్కడ కర్ఫ్యూ నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటలకు కిరాణా షాపులు మూసేస్తున్నారు. దాంతో బయట తాత్కాలికంగా ఒక స్టాల్ను ఏర్పాటు చేశాడు. అందులో రోజూ 300 రొట్టె ప్యాకెట్లను ఉంచుతున్నాడు. కానీ వాటిని అమ్మేందుకు కౌంటర్లో మనిషిని మాత్రం ఏర్పాటు చేయలేదు. పక్కనే గల్లాపెట్టెను ఏర్పాటు చేశాడు. కావలసిన వాళ్లు రొట్టెలు తీసుకొని ప్యాకెట్కు రూ 30 చొప్పున గల్లాపెట్టెలో వేసి వెళుతున్నారు. స్థానికుల నుంచి ఈ పద్ధతికి మంచి స్పందన వస్తోంది. అతనికి మంచి ఆదాయం వస్తోంది. ఇంతవరకూ ఎవరూ విఘ్నేశ్ను మోసం చేయలేదు. ఎవరైనా పెద్ద నోట్లు తెస్తే ప్యాకెట్ ధర పోను గల్లాపెట్టె నుంచి సరిపడా చిల్లర మాత్రమే తీసుకుంటున్నారు. సాయంత్రం బ్రెడ్ ప్యాకెట్లు స్టాల్లో ఉంచడానికి వెళ్లినప్పుడు అప్పటివరకూ జమ అయిన డబ్బును తెచ్చుకుంటాడు. ‘‘ప్రస్తుతం బయట భోజనం దొరకడం లేదు, మరోవైపు భోజనానికి సరిపడా డబ్బులు నిరుపేదల దగ్గర లేవు. అలాంటివారికి ఉపయోగపడాలన్న ఆలోచనతో ఈ ఏర్పాటు చేశాను’’ అని విఘ్నేశ్ చెప్పారు.