ఎన్నాళ్ళిలా?
ABN , First Publish Date - 2020-03-08T05:52:25+05:30 IST
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏటా ఒక్కో ప్రత్యేక ఇతివృత్తాన్ని ప్రధానాంశంగా చేసుకొని, కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. గత ఏడాది ఇతివృత్తం - ‘బ్యాలెన్స్ ఫర్ బెటర్’. ఆఫీసు బోర్డు రూముల నుంచి మీడియాలో, సంపద సృష్టిలో మహిళలకు...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏటా ఒక్కో ప్రత్యేక ఇతివృత్తాన్ని ప్రధానాంశంగా చేసుకొని, కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. గత ఏడాది ఇతివృత్తం - ‘బ్యాలెన్స్ ఫర్ బెటర్’. ఆఫీసు బోర్డు రూముల నుంచి మీడియాలో, సంపద సృష్టిలో మహిళలకు స్థానం కల్పిస్తూ, లైంగిక సమతౌల్యతను సాధించడం గత ఏడాది ప్రధానాంశం. ఇక, ఈ ఏడాది ఇతివృత్తం - ‘ఈచ్ ఫర్ ఈక్వల్’. వ్యక్తిగత ప్రయత్నంతో మూసను బద్దలు కొట్టి, పక్షపాత వైఖరిపై పోరాడిన మహిళల విజయాలపై అందరి దృష్టీ పడేలా చేయడం ఇందులో భాగం. మరి, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనకు గుర్తు చేస్తున్నదేమిటి?
నిజానికి, పురుషులతో సమానంగా మహిళలకూ చోటిస్తూ, లింగ వివక్షను దూరం చేయడమనేది ఇప్పటికీ సాధ్యం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు - ఇలా ఎక్కడ చూసినా ఇప్పటికీ స్త్రీ పురుషుల మధ్య అవకాశాల నుంచి వేతనాల దాకా అన్నింటిలో తేడా కొనసాగుతూనే ఉంది. విద్య, వైద్యం, వారిపై సాగుతున్న హింస లాంటి అనేక విషయాల్లో మగవాళ్ళతో పోలిస్తే ఆడవారి పరిస్థితి ఘోరంగా ఉంది.
బ్రిటన్లోని ప్రధాన సంస్థల్లో మగవారికి చెల్లిస్తున్న వేతనంలో సగం కన్నా తక్కువే ఇప్పటికీ మహిళలకు ఇస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
76.7 శాతంతో పాశ్చాత్య ఐరోపా అత్యధిక జెండర్ పారిటీ రేటింగ్లో నిలిచింది.
మన దేశంలో కూడా ఇప్పటికీ స్త్రీ పురుషుల మధ్య వేతనాల్లో వ్యత్యాసం స్సష్టంగా కనిపిస్తూనే ఉంది. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకు దాదాపు 35 శాతం మేర తక్కువ వేతనాలు ఇస్తున్నారని అంతర్జాతీయ శ్రామిక సంస్థ (ఐ.ఎల్.ఒ) నివేదిక పేర్కొంది.