రక్షణ దక్కుతుందా?
ABN , First Publish Date - 2020-05-19T05:30:00+05:30 IST
‘కొవిడ్ - 19’ చికిత్సలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు... ‘హైడ్రోక్లోరోక్విన్’! ‘లూపస్’ వ్యాధి చికిత్సలోనూ ఇవే ప్రధానమైన మందులు. అలాంటప్పుడు పూర్వం నుంచి ఇవే మందులను వాడే లూపస్ రోగులకు కరోనా నుంచి రక్షణ దొరుకుతుందా?...

‘కొవిడ్ - 19’ చికిత్సలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు... ‘హైడ్రోక్లోరోక్విన్’! ‘లూపస్’ వ్యాధి చికిత్సలోనూ ఇవే ప్రధానమైన మందులు. అలాంటప్పుడు పూర్వం నుంచి ఇవే మందులను వాడే లూపస్ రోగులకు కరోనా నుంచి రక్షణ దొరుకుతుందా? ఈ మందుల కొరతను లూపస్ రోగులు ఎదుర్కొనేదెలా?
ప్రధానంగా 15 నుంచి 40 ఏళ్ల మహిళల్లో కనిపించే లూపస్ వ్యాధికి హైడ్రోక్లోరోక్విన్ మందుల వాడకమే ప్రధాన చికిత్స. ఇవే మందులను కరోనా చికిత్సకు ఉపయోగిస్తూ ఉండడంతో, లూపస్ వ్యాధిగ్రస్తులకు మందుల కొరత తలెత్తుతోంది. అయితే 8 ఏళ్ల పాటు హైడ్రోక్లోరోక్విన్ను క్రమం తప్పకుండా వాడిన రోగుల్లో వ్యాధి తిరగెబట్టే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది. ఏళ్ల తరబడి ఈ మందులు వాడిన వారి శరీరంలో ఆ ఔషధం ప్రభావ వాడకం ఆపేసిన తర్వాత కూడా నెల రోజుల పాటు కొనసాగుతుంది. కాబట్టి మందుల కొరత వల్ల వాటి వాడకం ఆలస్యమైనా లూపస్ రోగులు కంగారు పడవలసిన అవసరం లేదు. ఆ మందులు అందుబాటులోకి వచ్చిన తర్వాత కొనసాగిస్తే సరిపోతుంది. ఒకవేళ తక్కువ మందులు ఉంటే, రోజు విడిచి రోజు తీసుకోవచ్చు.
రక్షణ ప్రశ్నార్ధకమే!
హైడ్రోక్లోరోక్విన్ మందులు కొవిడ్ - 19 చికిత్సలో మెరుగైన ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. అయితే మన దేశంలో 20 మంది రుమటాలజిస్టుల నుంచి సేకరించిన 850 మంది లూపస్ రోగుల్లో, 19 మంది ‘కొవిడ్ - 19’ సోకిన వారూ ఉన్నట్టు తేలింది. కాబట్టి హైడ్రోక్లోరోక్విన్ వాడిన లూపస్ రోగులకు కరోనా సోకదని రూఢిగా చెప్పే పరిస్థితి లేదు. అయితే వృద్ధులైన, మూత్రపిండాల జబ్బులున్న లూపస్ రోగులు, రక్తపోటు, మధుమేహం ఉన్న వారికి కొవిడ్ - 19 సోకితే సమస్యలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఈ కోవలకు చెందినవారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సామాజిక దూరం పాటించాలి. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మాస్క్లు తప్పక ధరించాలి. ఈ నియమాలన్నీ కచ్చితంగా పాటించాలి.
- డాక్టర్ రాజ్ కిరణ్ దూదం
రుమటాలజీ కన్సల్టెంట్,
హైదరాబాద్ రుమటాలజీ సెంటర్.