ముందే కనిపెట్టవచ్చు!
ABN , First Publish Date - 2020-06-23T05:30:00+05:30 IST
అన్ని రకాల కేన్సర్లు తొలి దశల్లో కనిపెడితే పూర్తిగా నయం అయిపోయేవే! అయితే వాటిని ప్రారంభంలోనే గుర్తించాలంటే, అవి బయల్పరిచే లక్షణాలను కనిపెట్టాలి. అందుకోసం ఇవిగో ఈ మెలకువలను పాటించాలి...

అన్ని రకాల కేన్సర్లు తొలి దశల్లో కనిపెడితే పూర్తిగా నయం అయిపోయేవే! అయితే వాటిని ప్రారంభంలోనే గుర్తించాలంటే, అవి బయల్పరిచే లక్షణాలను కనిపెట్టాలి. అందుకోసం ఇవిగో ఈ మెలకువలను పాటించాలి.
పెద్దపేగు కేన్సర్: మలద్వారం నుంచి రక్తస్రావం, మలంలో రక్తం, వారాల తరబడి విరేచనాలు, మలబద్ధకం, తీవ్రమైన కడుపునొప్పి, అకారణంగా బరువు కోల్పోవడం లాంటివి పెద్దపేగు కేన్సర్లో కనిపించే ప్రధాన లక్షణాలు. వంశంలో కేన్సర్ రోగులు ఉన్నవారు, అల్సరేటివ్ కొల్లైటిస్ సమస్య ఉన్నవారు, కేన్సర్ నుంచి కోలుకున్నవారు క్రమం తప్పక వైద్యులను కలుస్తూ, అవసరమైన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
ప్రోస్టేట్ కేన్సర్: పురుషులు క్రమం తప్పక ప్రోస్టేట్ పరీక్షలు చేయించుకోవడం ఒక్కటే ఈ రకమైన కేన్సర్ను ముందుగానే కనిపెట్టగల మార్గం. వంశంలో కేన్సర్ బాధితులు ఉంటే, 40 ఏళ్లకు చేరుకున్నప్పటి నుంచి ప్రతి పురుషుడూ ప్రోస్టేట్ స్ర్కీనింగ్ చేయించుకోవాలి. 50 ఏళ్లు దాటిన తర్వాత ‘ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్’, డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ మొదలైన పరీక్షలు చేయించుకోవాలి.
చర్మ కేన్సర్: పుట్టుకతో ఉన్నవి కాకుండా కొత్తగా పుట్టుమచ్చలు తలెత్తినా, అప్పటికే ఉన్న పుట్టుమచ్చల్లో మార్పు కనిపించినా వెంటనే వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. చర్మం మీద ఏర్పడిన మచ్చ అంచుల్లో రంగు గజిబిజిగా అలికినట్టు ఉన్నా, గరుకుగా ఉన్నా అనుమానించాలి. పుట్టుమచ్చ మునుపటి రంగు మారినా, మందంగా తయారైనా, పావు అంగుళానికి మించి పరిమాణం పెరిగినా, మచ్చ చుట్టూరా ఉన్న చర్మం వాచినా, కేన్సర్గా అనుమానించి వెంటనే వైద్యులను కలవాలి.
-డాక్టర్ సి.హెచ్. మోహన వంశీ
సర్జికల్ ఆంకాలజిస్ట్