సెప్టెంబరు 5 నుంచి స్కూళ్లు?
ABN , First Publish Date - 2020-07-19T22:11:22+05:30 IST
రాష్ట్రంలో పాఠశాలలను సెప్టెంబరు 5వ తేదీ నుంచి పునఃప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఆగస్టు 3వ తేదీ నుంచే స్కూళ్లు ప్రారంభిస్తున్నట్లు గత నెలలో విద్యాశాఖ సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ప్రకటించారు. అయితే, దీనిపై

కేంద్రానికి రాష్ట్ర సర్కారు సమాచారం
‘టీచర్స్ డే’నాడు ప్రారంభించాలని యోచన
అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాఠశాలలను సెప్టెంబరు 5వ తేదీ నుంచి పునఃప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఆగస్టు 3వ తేదీ నుంచే స్కూళ్లు ప్రారంభిస్తున్నట్లు గత నెలలో విద్యాశాఖ సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ప్రకటించారు. అయితే, దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇదిలావుంటే, కరోనా విజృంభణ నేపథ్యంలో పాఠశాలల భద్రతా ప్రణాళికలపై కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ఈ నెల 15న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా పాఠశాలలను ఎప్పుడు పునఃప్రారంభిస్తారో తెలియజేయమని కేంద్రం కోరింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు సెప్టెంబరు 5వ తేదీన ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఆరోజు ‘ఉపాధ్యాయ దినోత్సవం’ కనుక ‘జగనన్న విద్యా కానుక’ కింద 36.1 లక్షల మంది విద్యార్థులకు విద్యా కిట్(స్కూలు బ్యాగ్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, 3 జతల యూనిఫాం, బూట్లు, 2 జతల సాక్స్) అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న ఉద్దేశంతో అలా చెప్పినట్లు సమాచారం.
‘నాడు-నేడు’ పరిశీలన
పాఠశాల విద్యాశాఖ అధికారులు శనివారం కృష్ణా జిల్లాలోని పలు పాఠశాలలను సందర్శించి ‘నాడు-నేడు’ పనులతో పాటు పలు కార్యక్రమాల అమలుతీరును తెలుసుకున్నారు.