జేఈఈ, నీట్‌ రద్దు?

ABN , First Publish Date - 2020-06-23T17:08:08+05:30 IST

పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్న సీబీఎస్‌ఈ, జేఈఈ, నీట్‌ పరీక్షలు రద్దయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంగళవారం స్పష్టం చేయనుంది. జూలై 1 నుంచి

జేఈఈ, నీట్‌ రద్దు?

సీబీఎస్‌ఈ పరీక్షలపై సుప్రీంలో పిటిషన్‌

నేడు స్పష్టం చేయనున్న కేంద్రం


న్యూఢిల్లీ, జూన్‌ 22: పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్న సీబీఎస్‌ఈ, జేఈఈ, నీట్‌ పరీక్షలు రద్దయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంగళవారం స్పష్టం చేయనుంది.  జూలై 1 నుంచి 15 వరకు నిర్వహించనున్న సీబీఎస్‌ఈ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ ఇటీవల కొంత మంది తల్లిదండ్రులు  సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విదేశాల్లో సీబీఎస్‌ఈకి అనుబంధంగా నిర్వహిస్తున్న దాదాపు 250 స్కూళ్లలో ఇప్పటికే పరీక్షలను రద్దు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.


ఇండియాలో కూడా పరీక్షలను రద్దు చేసి అంతర్గత పరీక్షల మార్కుల ఆధారంగా విద్యార్థులను ఉత్తీర్ణులను చేయాలని పలువురు తల్లిదండ్రులు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు నానాటికీ పెరుగుతున్న కొవిడ్‌ కేసుల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఎంత వరకు శ్రేయస్కరమనే విషయాన్ని పరిశీలించాల్సిందిగా సీబీఎస్‌ఈ అధికారులను ఆదేశించింది. పరీక్షలు రద్దు చేయడమా, వాయిదా వేయడమా అనే అంశంపై జూన్‌ 23లోగా తమ నిర్ణయం వెల్లడిస్తామని సీబీఎ్‌సఈ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మరోపక్క కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ సీబీఎ్‌సఈ, ఎన్‌టీఏ, పాఠశాల విద్యాశాఖ అధికారులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ నేపథ్యంలో జేఈఈ, నీట్‌ పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపైనా చర్చించారు. సీబీఎస్‌ఈతోపాటు ఈ పరీక్షలపై ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి మంగళవారం వెల్లడించనున్నారు. కాగా, సీబీఎస్‌ఈ పరీక్షలను రద్దు చేయాలని ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, ఒడిసాలు కేంద్రాన్ని కోరాయి. మరికొన్ని రాష్ట్రాలు జేఈఈ, నీట్‌ పరీక్షలను సైతం రద్దు చేసి ఇంటర్‌ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశాయి. అయితే ఇంజనీరింగ్‌, మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ, నీట్‌ పరీక్షలను రద్దు చేస్తే దాని ప్రభావం ఏమేరకు ఉంటుందన్న దానిపైనా కేంద్రం సీరియ్‌సగా ఆలోచిస్తోంది.


కొవిడ్‌  పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని  జేఈఈ, నీట్‌ పరీక్ష కేంద్రాలను ఇప్పటికే రెట్టింపు చేశారు. మరికొన్ని పరీక్షా కేంద్రాలను పెంచి ఈ రెండు పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించడమా లేక పూర్తిగా రద్దు చేయడమా అనే కోణంలోనూ కేంద్రం యోచిస్తోంది. కాగా, ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ పరీక్షలను రద్దు చేయడంవైపే కేంద్రం మొగ్గుచూపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  మరోవైపు సీబీఎస్‌ఈ మాదిరిగా జేఈఈ, నీట్‌ పరీక్షలను రద్దు చేయడం సులువు కాదని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.


జేఈఈ మెయిన్‌

ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే అర్హత పరీక్ష జేఈఈని ఏటా రెండు సార్లు(జనవరి, ఏప్రిల్‌లో) నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తుంది. మెయిన్‌ పరీక్ష కోసం ఈ ఏడాది 11,18,673 మంది దరఖాస్తు చేసుకున్నారు. జేఈఈ మెయిన్‌లో సాధించిన మెరిట్‌ ఆధారంగా 31 ఎన్‌ఐటీలు, 25 ట్రిపుల్‌ఐటీలు, 28 జీఎ్‌ఫటీఐలో బీఈ, బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఈ మూడింటిలో కలిపి మొత్తం 38,704 సీట్లున్నాయి. ఇక ఐఐటీల్లో చేరాలనుకునే వారు తప్పనిసరిగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో అర్హత సాధించాలి. జేఈఈ మెయిన్స్‌ నుంచి 2,50,000 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు క్వాలిఫై అవుతారు.   


నీట్‌

అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సులైన ఎంబీబీఎస్‌/బీడీఎ్‌సలో ప్రవేశానికి నీట్‌ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఏడాది నీట్‌కు 15.94 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.  దేశవ్యాప్తంగా మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. 

Updated Date - 2020-06-23T17:08:08+05:30 IST