3795 మంది వీఆర్‌ఏలకు వీఆర్‌వోలుగా పదోన్నతి

ABN , First Publish Date - 2020-01-28T16:03:37+05:30 IST

గ్రామ రెవెన్యూ సహాయకు (వీఆర్‌ ఏ)లుగా పనిచేస్తోన్న 3795 మందికి గ్రేడ్‌-2 గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్‌వో)గా పదోన్నతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది.

3795 మంది వీఆర్‌ఏలకు వీఆర్‌వోలుగా పదోన్నతి

అమరావతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): గ్రామ రెవెన్యూ సహాయకు (వీఆర్‌ ఏ)లుగా పనిచేస్తోన్న 3795 మందికి గ్రేడ్‌-2 గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్‌వో)గా పదోన్నతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది. సుదీర్ఘకాలంగా గ్రామ సహాయకులుగా పనిచేస్తున్న వీఆర్‌ఏలకు కనీసం ఇంటర్‌ విద్యార్హత, ఐదేళ్ల రెగ్యులర్‌ సర్వీసును ప్రామాణికంగా తీసుకుని సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు ఇవ్వాలని రెవెన్యూ కార్యదర్శి వి. ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల వారీగా ఖాళీలను నోటిఫై చేసి 15 రోజుల్లోగా పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేయాలని ఆ ఉత్తర్వుల్లో కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. కొన్నేళ్లుగా వీఆర్‌ఏలు చేస్తున్న అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం సర్వీసు రూల్స్‌లో స్వల్ప సవరణలు చేస్తూ.. 3795 మంది వీఆర్‌ఏలకు పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించింది. జనవరి 1 నాటికి వీఆర్‌ఏలుగా కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసి.. ఇంటర్‌ విద్యార్హత కలిగి ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా.. సర్కారు నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి, వీఆర్‌ఏల సంఘం నేత కైకాల గోపాలరావు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-01-28T16:03:37+05:30 IST