టీవీల ముందు 12 లక్షల మంది
ABN , First Publish Date - 2020-09-03T14:33:18+05:30 IST
మంగళవారం నుంచి ప్రారంభమైన ఆన్లైన్ విద్యకు విశేష ఆదరణ లభిస్తోంది. గతంలో ఎన్నడూలేనివిధంగా టీశాట్ వీక్షణంలో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో

సర్కారీ ఆన్లైన్ పాఠాలకు భారీ స్పందన.. ‘టీశాట్’ ప్రసారాల రికార్డు
తొలిరోజు 1.56 లక్షలు, రెండోరోజు 53,390 సబ్స్ర్కైబర్లు
హైదరాబాద్, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): మంగళవారం నుంచి ప్రారంభమైన ఆన్లైన్ విద్యకు విశేష ఆదరణ లభిస్తోంది. గతంలో ఎన్నడూలేనివిధంగా టీశాట్ వీక్షణంలో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో 16.43 లక్షలు ఉండగా.. తొలిరోజు టీసాట్, దూరదర్శన్ ద్వారా మొత్తం 14.03 లక్షల మంది వీక్షించారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఇందులో టీశాట్ చానల్ ద్వారా 10.72 లక్షల మంది వీక్షించారని మంత్రి తెలిపారు.
కాగా తొలిరోజు టీశాట్ మొబైల్ యాప్, యూట్యూబ్ చానల్లను కూడా కలుపుకుంటే పాఠాలు వీక్షించిన వారి సంఖ్య 11.74 లక్షలని టీసాట్ బుధవారం ప్రకటించింది. టీశాట్ యూట్యూబ్ చానల్కు తొలిరోజైన మంగళవారం 1,56,658 మంది, రెండోరోజు 53,390 మంది కొత్తగా సబ్స్ర్కైబ్ అయ్యారని టీశాట్ సీఈవో శైలేష్ రెడ్డి తెలిపారు. దీంతో తమ యూట్యూబ్ చానల్ సబ్స్ర్కైబర్ల సంఖ్య 4.66 లక్షలకు చేరిందన్నారు. టీశాట్ ప్రారంభించినప్పటి నుంచి ఒకేరోజు ఇంతమంది వీక్షించడం రికార్డు అన్నారు.