‘‘ఏదైనా ఈ రోజు చేస్తే కదా.. రేపటికి చరిత్ర అవుతుంది.’’
ABN , First Publish Date - 2020-07-06T06:57:08+05:30 IST
పనే ముఖ్యం అన్న వాళ్ళకి ప్రచారం పట్టదు. ప్రచారం కోసం చేసే వాళ్లకు పనితో పని లేదు. రామినాయుడు పనిమంతుడు. నిశ్చల బలోన్నతుడు. ఎంతటి కార్యాన్నైనా తా చక్కగా ఒనర్చగల కార్యకర్త. సాహిత్యమే శ్వాసగా జీవిస్తున్నవాడు...
పనే ముఖ్యం అన్న వాళ్ళకి ప్రచారం పట్టదు. ప్రచారం కోసం చేసే వాళ్లకు పనితో పని లేదు. ‘వెలుగు’ రామినాయుడు పనిమంతుడు. నిశ్చల బలోన్నతుడు. ఎంతటి కార్యాన్నైనా తా చక్కగా ఒనర్చగల కార్యకర్త. సాహిత్యమే శ్వాసగా జీవిస్తున్నవాడు. కాళ్లకు సహజ చక్రాలతో పుట్టిన సంచారి. దరిదాపుల్లో ఎక్కడ సాహిత్య సభ జరుగుతున్నట్టు తెలిసినా ఆహ్వానంతో నిమిత్తం లేకుండా హాజరయ్యే సాహిత్య పిపాసి. అంతేనా...? తన పాటతో సభను పరిపూర్ణం చేసే వాడు. అప్పుడప్పుడు కంట్రీ లైఫ్ మీద మాత్రమే కవిత్వం రాసే దేశి కవి. ఆయన అంతరంగం ఇది.
ఆధునిక తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు గురజాడ కొండగుర్తు కదా. విజయనగరం గజపతిరాజులకు విద్యారంగం పట్ల, లలిత కళల పట్ల, అభిరుచి, ఔదార్యం లేకపోతే, ఈరోజు చెప్పుకోడానికి ఏముంది. ‘‘ఊరు విజయనగరం. పేరు మధురవాణి’’ అని ఆ మహాతల్లి చెప్పుకుంటే ఈరోజు మేము కూడా చెప్పుకుంటున్నాం కదా. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నాం కదా. ఇక గురజాడ అంటారా మనం పట్టించుకోవాల్సిన అంతగా పట్టించుకోలేదు. పట్టించుకుంటే వెధవాయిత్వం ఇంతగా వ్యవస్థీకృతం కాకపోను.
చిరుదీపం వెలిగించాలనే సదాశయంతో నాలుగు దశాబ్దాల క్రితం చాసో గౌరవ అధ్యక్షుడిగా విజయనగరం రైల్వే కాలనీలో ‘వెలుగు’ సంస్థ ప్రారంభమైంది. ఆదిలోనే అది కొడిగట్టిపోకుండా నా సహోద్యోగులు సహకరించారు- గోరంత దీపం కొండంత వెలుగు అనే ఆశతో. శీలా వీర్రాజు గారు ‘వెలుగు’ ఆశయాన్ని ప్రతిబింబిస్తూ మంచి లోగో చిత్రించారు. నాటి నుంచి నేటి వరకు గురజాడ అడుగుజాడను ఆదర్శంగా తీసుకుని తన పయనాన్ని కొనసాగిస్తూనే ఉంది.