నిబంధనలు సడలించి రచయితలకు సహకరించాలి
ABN , First Publish Date - 2020-06-19T05:36:49+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 21.05.2020న డైరెక్టర్ అఫ్ పబ్లిక్ లైబ్రరీస్ నుండి పుస్తకాల కొనుగోలు కొరకు నోటిఫికేషన్ జారి చేసింది. నోటిఫికేషన్ ప్రకారం 02.06.2014 నుండి ప్రచురణ అయిన పుస్తకాలను కొనుగోలు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 21.05.2020న డైరెక్టర్ అఫ్ పబ్లిక్ లైబ్రరీస్ నుండి పుస్తకాల కొనుగోలు కొరకు నోటిఫికేషన్ జారి చేసింది. నోటిఫికేషన్ ప్రకారం 02.06.2014 నుండి ప్రచురణ అయిన పుస్తకాలను కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది. తెలుగు మాత్రమే కాకుండా ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, కన్నడ, తమిళ్, ఒరియా, సంస్కృత భాషల పుస్తకాలను కూడా కొనుగోలు చేస్తామని ప్రకటించింది. నోటిఫికేషన్ ప్రకారం పుస్తకాలు కొనుగోలు చేయాలంటే రచయిత తన పుస్తకాలను నాలుగు జాతీయ గ్రంథాలయాలకు పంపి రిజిస్టర్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్ అఫ్ పబ్లికేషన్స్ గుంటూరు వారికి కూడా నాలుగు ప్రతులను పంపి పుస్తకాలను రిజిస్టర్ చేసుకోవాలి. అలా రిజిస్టర్ చేసుకొని వారు ఇచ్చిన రిసీట్ లను జత చేసి విజయవాడ టాగోర్ మెమోరియల్ లైబ్రరీకి పంపమని ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఉన్నది. చాలా మంది తెలుగు రచయితలకు ఈ విషయాలు తెలియవు. ఈ లాక్డౌన్ కారణంగా నాలుగు జాతీయ గ్రంథాలయాలకు ఇప్పుడు పంపడం కుదరదు. ఒకవేళ పంపినా ముంబైలో ఉన్న సెంట్రల్ లైబ్రరీ నుండి రిసీట్ అందదు. పుస్తకాలు పంపి పోస్టల్ డిపార్టుమెంటు వారు ఇచ్చే రిసీట్ అయినా జత చేద్దామంటే పోస్టల్ డిపార్టుమెంటు వారు ముంబైకి తీసుకోవడం లేదు. నాలుగు జాతీయ గ్రంథాలయాలకు పంపినా రెండు గ్రంథాలయాల నుండి రిసీట్ అందడం లేదు. కావున ఈ ఏడాది కేవలం ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్ అఫ్ పబ్లికేషన్స్ లో రిజిస్టర్ అయిన పుస్తకాలు మాత్రమే తీసుకోవాలి. నాలుగు జాతీయ గ్రంథాలయాల రిసీట్ తప్పనిసరి అన్న నిబంధన సడలించి రచయితలకు ప్రభుత్వం సహకరింహలి. నోటిఫికేషన్ ప్రకారం జూన్ 26.2020 పుస్తకాలు పంపడానికి చివరి తేది కానీ సమయాన్ని ఇంకాస్త పొడిగించి రచయితలకు ఊరట నివ్వాలని కోరుతున్నాను.
జాని తక్కెడశిల(అఖిలాశ)