భావుకుడు, కార్యవాది

ABN , First Publish Date - 2020-11-13T05:40:06+05:30 IST

సంవత్సరాలు ఇట్టే నిండిపోతాయి, నెలలు ఇట్టే తిరిగివస్తాయి, రోజులు ఇట్టే దొర్లిపోతాయి. అయినా పెక్కు శతాబ్దాల తర్వాత...

భావుకుడు, కార్యవాది

స్వాతంత్ర్యసమరయోధుడుగా, ప్రజానాయకుడుగా, ప్రభుత్వాధినేతగా సమకాలిక ప్రపంచ ప్రముఖులలో ఎన్నదగువాడుగా జవహర్ లాల్ నెహ్రూ సాధించిన విజయాలు స్వల్పమైనవి కావు, సాధారణమైనవీ కావు. కాని, ఆయన కార్యరంగంలో సాధించిన విజయాల కంటె జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఆయన వ్యక్తిత్వ ప్రభావం ఎంతో ముఖ్యమైంది.


సంవత్సరాలు ఇట్టే నిండిపోతాయి, నెలలు ఇట్టే తిరిగివస్తాయి, రోజులు ఇట్టే దొర్లిపోతాయి. అయినా పెక్కు శతాబ్దాల తర్వాత కూడా జవహర్ లాల్ నెహ్రూ మూర్తి జరాభారరహితమైన అదే జీవకళతో, ఆలోచనా మిళితమైన, అదే మందహాసంతో, చిత్తశుద్ధి ప్రేరితమైన అదే సేవాక్షాంక్షతో, మానవ కల్యాణ సాధనోత్సుకతతో కూడిన అదే దీప్తితో- చెదరక-చెరగక-చెన్నుతరగక -నిత్యమై నిలుస్తుంది; ఇది ముమ్మాటికీ నిజం. తరతరాల వరకు దాని తారళ్యం తరగదు; యుగయుగాల వరకు దాని శోభ సన్నగిల్లదు. తన జీవిత కాలంలోనే నెహ్రూ జాతీయ చరిత్రలోనే కాక, అంతర్జాతీయ చరిత్రలో కూడా ఒక మహోన్నత స్థానాన్ని సంపాదించుకొన్నాడు. కాలక్రమాన ఆ స్థానం విస్తరిస్తుంది. దాని ప్రాధాన్యం పెరుగుతుంది.


ఆయన ఉద్విగ్నుడు మాత్రమే కాదు. ఉదాత్తుడు కూడా. ఆయన భావుకుడు మాత్రమే కాదు, కార్యవాది కూడా. ఆయన ఆదర్శవాది మాత్రమే కాదు, ఆచరణలో సాధ్యాసాధ్యాలను గుర్తించిన వాడు కూడా. ఆయన నాయకుడే కాదు, అనుచరుడు కూడా. ఆయన స్వాతంత్ర్యకాంక్షి మాత్రమే కాదు, క్రమశిక్షణ విలువ గుర్తించిన వాడుకూడా. ఆయన రాజకీయవేత్త మాత్రమే కాదు, కవి హృదయం ఉన్న రచయిత కూడా. ఆయన దేశ భక్తుడు మాత్రమే కాదు, ప్రపంచ సౌభాగ్య గామి కూడా.


స్వాతంత్ర్యసమరయోధుడుగా, ప్రజానాయకుడుగా, ప్రభుత్వాధినేతగా సమకాలిక ప్రపంచ ప్రముఖులలో ఎన్నదగువాడుగా జవహర్ లాల్ నెహ్రూ సాధించిన విజయాలు స్వల్పమైనవి కావు, సాధారణమైనవీ కావు. కాని, ఆయన కార్యరంగంలో సాధించిన విజయాల కంటె జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఆయన వ్యక్తిత్వ ప్రభావం ఎంతో ముఖ్యమైంది. అనేక విషయాలలో -ముఖ్యంగా అధి భౌతిక విషయాలలో, ఆర్థిక సూత్రాలలో, వైజ్ఞానిక, సాంకేతికాది శాస్త్రాల ప్రాధాన్య ప్రభావాల విషయంలో, వీటినన్నింటిని వెరసి చేయగా రాగల ‘ఫిలాసఫీ ఆఫ్ లైఫ్’లో గాంధీతో నెహ్రూ విభేదించినా, జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విలువల సందర్భంలో ఆయన గాంధీతో ఏకీభవించడమే కాక, వాటికి అనుగుణంగా తాను నడవడానికి చిత్తశుద్ధితో కృషి చేశాడు. గాంధీకి తామే సిసలైన వారసులుగా ప్రస్తుతం చెప్పు కొంటున్న వారందరినీ గాంధేయ తత్వ ప్రాతిపదికలను జవహర్ లాల్ చక్కగా, ఎక్కువగా అర్థం చేసుకొన్నాడు, విజ్ఞతతో వాటిని ఆధునిక యుగ ప్రభావాలకు, పరిణామాలకు అనుగుణంగా రూపొందించడానికి కృషి చేశాడు.

1965 మే 17 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం ‘నెహ్రూ తాత్త్విక దృష్టి’ నుంచి

Updated Date - 2020-11-13T05:40:06+05:30 IST