పెళ్లికి ముందు వరుడితో చనువు వద్దన్నందుకు ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-05-31T13:41:10+05:30 IST
పెళ్లికి ముందు వరుడితో చనువుగా ఉండవద్దని నిశ్చితార్థం జరిగిన
హైదరాబాద్/మల్కాజిగిరి : పెళ్లికి ముందు వరుడితో చనువుగా ఉండవద్దని నిశ్చితార్థం జరిగిన యువతిని తండ్రి మదలించాడు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా కర్లపాలెంకు చెందిన కుంచల శివారెడ్డి కొంతకాలం క్రితం కుటుంబంతో వచ్చి మౌలాలి జవహర్నగర్లో ఉంటున్నాడు. ఈయన కూతురు కవిత(20)కు మేనబావ కృష్ణారెడ్డితో ఇటీవల నిశ్చితార్థం జరిగింది.
కృష్ణారెడ్డి 15రోజుల కిందట శివారెడ్డి ఇంటికి రాగా కవిత చనవుగా మెలిగింది. పెళ్లికి ముందు చనువు వద్దని శివారెడ్డి కవితను సున్నితంగా హెచ్చరించాడు. దీంతో కవిత శుక్రవారం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు యశోద ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.