అనుమానాస్పద స్థితిలో.. బుల్లితెర నటి మృతి
ABN , First Publish Date - 2020-04-10T06:51:35+05:30 IST
ఓ బుల్లితెర నటి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఉదంతమిది. ఈ సంఘటన ఎస్ఆర్నగర్ పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ...
చనిపోయిన 3 రోజులకు గుర్తింపు
అమీర్పేట, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఓ బుల్లితెర నటి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఉదంతమిది. ఈ సంఘటన ఎస్ఆర్నగర్ పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ, ఎస్సై కృష్ణయ్య కథనం ప్రకారం.. ఏపీలోని విశాఖ జిల్లాకు చెందిన విశ్వశాంతి(23) సినిమాల్లో నటించేందుకు మూడేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు. ఎల్లారెడ్డిగూడలోని ఓ అపార్ట్మెంట్లో తన తల్లితో కలిసి అద్దెకు ఉంటున్నారు. టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు. కొంతకాలం క్రితం తల్లి విశాఖకు వెళ్లిపోవడంతో.. విశ్వశాంతి ఒంటరిగా ఉంటున్నారు. 3 రోజులుగా ఆమె తన ఫ్లాట్ నుంచి బయటకు రాకపోవడంతో అపార్ట్మెంట్ వాచ్మన్ అనుమానంతో తలుపు తట్టాడు. ఎంతకీ స్పందన లేకపోవడంతో ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లి చూడగా, విశ్వశాంతి విగతజీవిగా పడి ఉన్నారు. ఆమె తలభాగం నేలపైన.. కాళ్లు మంచంపై ఉన్నాయి. తలకు బలమైన గాయాలై, తీవ్ర రక్తస్రావమైన గుర్తులున్నాయి. ఆమె గదిలో మద్యం బాటిళ్లు లభించిన నేపథ్యంలో తాగిన మైకంలో ఆమె మంచం పైనుంచి కిందపడి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.