ఇన్ఫోసిస్ శిబులాల్కు నాలుగు లక్షలకు పైగా షేర్లను గిఫ్ట్ గా ఇచ్చిందెవరో...
ABN , First Publish Date - 2020-11-15T23:30:16+05:30 IST
ఇన్ఫోసిస్ శిబులాల్కు నాలుగు లక్షలకు పైగా షేర్లను గిఫ్ట్ గా ఇచ్చిందెవరో...

బెంగళూరు : ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు శిబులాల్ నాలుగు లక్షలకు పైగా కంపెనీ షేర్లను బహుమతిగా అందుకున్నారు. వీటితో కలిసి ప్రస్తుతం ఆయన వద్ద మొత్తం ఇన్ఫోసిస్ షేర్ల సంఖ్య 21.6 లక్షలు దాటింది. మొత్తం 4,01,000(0.01 శాతం) ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఈక్విటీ షేర్లను శిబులాల్కు కేటాయించినట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు కంపెనీ సమాచారమిచ్చింది. కాగా... ఈ షేర్లను ఎవరు బహుమతిగా ఇచ్చారన్న అంశాన్నిమాత్రం వెల్లడించలేదు. ఇన్ఫోసిస్ స్టాక్ గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 12 న ఆఫ్ మార్కెట్ లావాదేవీలో ఈ వాటా 0.01 శాతం. శిబులాల్ భార్య కుమారి 4.01 లక్షల షేర్లను అదే రోజు బహుమతిగా ఇచ్చినట్లు ఉన్నప్పటికీ, స్వీకర్త వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఇన్ఫోసిస్లో కుమారి వాటా 0.21 శాతానికి తగ్గిపోగా, శిబులాల్ వాటా 0.05 శాతానికి పెరిగింది. ఈ లావాదేవీ తర్వాత కుమారి వద్ద 88,96,930, శిబులాల్ దగ్గర 21,66,768 ఇన్ఫోసిస్ షేర్లు ఉన్నాయి.
జూలై నెలలో శిబులాల్, కుటుంబ సభ్యులు 85 లక్షల షేర్లను విక్రయించారు. వీటి విలువ రూ. 770 కోట్లు. ఈ మొత్తాన్ని దాతృత్వ కార్యకలాపాల కోసం, వివిధ సంస్థల్లో పెట్టుబడుల కోసం వినియోగించారు. ఎన్ఆర్ నారాయణమూర్తితో కలిసి శిబులాల్, మరో ఐదుగురు ఇన్ఫోసిస్ను 1981 లో ప్రారంభించారు. కాగా... 2011 నుండి 2014 వరకు ఆయన కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించారు. సీఈవో, ఎండీ కంటే ముందు 2007 నుండి 2011 మధ్య చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉన్నారు.