క్రికెటర్ కాబోయి బ్యాంకరయ్యాడు..
ABN , First Publish Date - 2020-12-19T06:07:02+05:30 IST
తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లు.. గొప్ప క్రికెటర్ అవ్వాలనుకున్న వ్యక్తి.. ప్రముఖ బ్యాంకర్గా ఎదిగాడు. అది మరెవరో కాదు..

ప్రపంచ సంపన్న బ్యాంకర్గా ఎదిగిన ఉదయ్ కోటక్
ప్రస్తుతం ఆయన ఆస్తి రూ.1,18,400 కోట్లు
తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లు.. గొప్ప క్రికెటర్ అవ్వాలనుకున్న వ్యక్తి.. ప్రముఖ బ్యాంకర్గా ఎదిగాడు. అది మరెవరో కాదు.. ఉదయ్ కోటక్. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ, సీఈఓ. ప్రపంచంలో అత్యంత సంపన్న బ్యాంకర్ కూడా. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయన ఆస్తి 1,600 కోట్ల డాలర్లు. అంటే, మన కరెన్సీలో రూ.1,18,400 కోట్లు. కోటక్ 20 ఏళ్ల ప్రాయంలో జరిగిన ఓ సంఘటన అతడి జీవిత లక్ష్యాన్నే మార్చేసింది. క్రికెట్ ఆడుతుండగా తలకు బంతి తగలడంతో అత్యవసర శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. మరణాన్ని తప్పించుకోగలిగినా.. ఆ దుర్ఘటన కారణంగా క్రికెటర్గా ఎదగాలన్న తన కలలకు తెరదించాల్సి వచ్చింది.
అయినప్పటికీ, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్న తపన ఆయనను విజయపథంలో నడిపించింది. ఆ యాక్సిడెంట్ నుంచి కోలుకున్నాక కోటక్ కొంతకాలం తన కుటుంబ వ్యాపారంలో కొనసాగాడు. అనంతరం, ముంబైలోని జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి ఎంబీఏ పూర్తి చేశాడు. పలు ప్రముఖ కంపెనీల ఉద్యోగ ఆఫర్లను కాదని, 1985లో ఫైనాన్స్ రంగంలో తన వ్యాపార ప్రస్థానానికి శ్రీకారం చుట్టాడు. ఆర్థిక సేవల మార్కెట్నే క్రికెట్ మైదానంగా మల్చుకున్న కోటక్.. మెరుపు ఇన్నింగ్స్లతో సక్సెస్ ట్రోఫీ చేజిక్కించుకున్నాడు.
కోటక్ వ్యాపార ప్రస్థానం
ఉదయ్ కోటక్ కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి రూ.30 లక్షలు రుణంగా తీసుకొని 1985లో ఇన్వెస్ట్మెంట్ కంపెనీని ప్రారంభించాడు. ఆ తర్వాత ఏడాదిలో మహీంద్రాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు. తొలుత బిల్స్ డిస్కౌంట్ సేవలతో ప్రారంభమైన కంపెనీని తర్వాత కాలంలో లోన్ పోర్ట్ఫోలియో, స్టాక్ బ్రోకరింగ్, ఇన్వె్స్టమెంట్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ సేవల్లోకీ విస్తరింపజేశాడు. ఆరంభంలో కోటక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్తో ప్రారంభమైన కంపెనీ మహీంద్రా పెట్టుబడుల తర్వాత కోటక్ మహీంద్రా ఫైనాన్స్ లిమిటెడ్గా మారింది. 2003లో ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎ్ఫసీ)కి ఆర్బీఐ బ్యాంకింగ్ లైసెన్సు మంజూరు చేసింది. తద్వారా కోటక్ మహీంద్రా బ్యాంక్గా మారింది. దేశంలో బ్యాంక్గా అవతరించిన తొలి ఎన్బీఎ్ఫసీ ఇదే.