చిత్తూరులో సంగం డెయిరీ ప్లాంట్
ABN , First Publish Date - 2020-12-11T08:16:38+05:30 IST
కార్యకలాపాల విస్తరణలో భాగంగా చిత్తూరు, నెల్లూరు మధ్య సంగం డెయిరీ ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వెల్లడించారు.
చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
జనవరి నుంచి పాల సేకరణ ధర పెంపు
చేబ్రోలు: కార్యకలాపాల విస్తరణలో భాగంగా చిత్తూరు, నెల్లూరు మధ్య సంగం డెయిరీ ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వెల్లడించారు. గురువారం జరిగిన పాలక వర్గ సమావేశంలో ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఆమోదం కూడా లభించిందని ఆయన తెలిపారు. అదేవిధంగా జనవరి నుంచి పాల సేకరణ ధర పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం లీటర్కు పది శాతం వెన్న వచ్చే పాల ధర రూ. 62గా ఉండగా కొత్త ఏడాది నుంచి దీన్ని రూ.64కు పెంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఇకపై ప్రతి నెల పాల ధరను సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. మరోవైపు రైతుల కోసం ప్రకాశం జిల్లా అద్దంకిలో వంద ఎకరాలలో సైలేజ్ తయారీకి రైతులతో అంగీకారం కుదుర్చుకున్నామని తెలిపారు. పాల సేకరణ పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలో పలు జిల్లాలో కొత్త చిల్లింగ్ సెంటర్ల ఏర్పాటుకు పాలకవర్గం ఆమోదించిందన్నారు.
రొంపిచెర్ల వద్ద కొండమూడు గ్రామంలో ఉన్న చిల్లింగ్ సెంటర్ను బ్యాంక్ ఆక్షన్లో కొనుగోలు చేశామన్నారు. అలాగే ప్రకాశం జిల్లా దర్శిలో మరో చిల్లింగ్ సెంటర్ను కొనుగోలు చేసినట్లు వివరించారు. ఈ రెండు చిల్లింగ్ సెంటర్లను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. చిత్తూరులో కొత్తగా నెలకొల్పనున్న ప్లాంట్ ద్వారా చెన్నై, కడప, అనంతపురం జిల్లాలకు సంగం డెయిరీని విస్తరించే అవకాశం లభిస్తుందని నరేంద్ర చెప్పారు. కాగా సంగం డెయిరీలో మహిళా ఉద్యోగులు పెరుగుతున్నందున వారి సంరక్షణ, భద్రత కోసం ప్రత్యేక పాలసీని అమల్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు.