ప్రభుత్వ టెల్కోల ఆస్తుల విక్రయం షురూ
ABN , First Publish Date - 2020-07-09T06:20:05+05:30 IST
ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీలు బీఎ్సఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు చెందిన స్థిరాస్తుల(భూములు, భవనాలు) విక్రయ ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం కన్సల్టెంట్లను నియమించుకుంది...
- కన్సల్టెంట్లను నియమించిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీలు బీఎ్సఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు చెందిన స్థిరాస్తుల(భూములు, భవనాలు) విక్రయ ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం కన్సల్టెంట్లను నియమించుకుంది. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టింగ్ సేవల సంస్థలైన సీబీఆర్ఈ, జేఎల్ఎల్, నైట్ ఫ్రాంక్కు ఈ బాధ్యతలు అప్పగించింది. కరోనా సంక్షోభ కాలంలోనూ ఈ స్థిరాస్తుల విక్రయం సాధ్యమేనా..? అని పరిశీలించాల్సిందిగా కన్సల్టింగ్ సంస్థలను డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వె్స్టమెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) కోరింది. ఈ విషయంపై ఆ కంపెనీలు నెలాఖరుకల్లా ప్రాథమిక నివేదికను సమర్పించనున్నాయి. బీఎ్సఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఆస్తుల విక్రయం ద్వారా రూ.37,500 కోట్ల మేర సమకూరవచ్చని ప్రభుత్వం అంచనా. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) టెలికాం శాఖను కోరినట్లు సమాచారం.
విక్రయానికి ఎంపిక చేసిన ఆస్తుల జాబితాలో బీఎ్సఎన్ఎల్కు చెందినవి 11కాగా, ఎంటీఎన్ఎల్కు చెందినవి ఐదు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న బీఎ్సఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు ఊరట కల్పించేందుకు ఈ స్థిరాస్తుల విక్రయం ఎంతగానో దోహదపడనుంది. ఈ రెండు కంపెనీల పునరుద్ధరణ కోసం గత ఏడాది అక్టోబరులో మోదీ సర్కారు రూ.70,000 కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించింది. స్థిరాస్తుల విక్రయం కూడా ఈ ప్యాకేజీలో భాగమే. తద్వారా సమకూరే నిధులు.. కంపెనీల రుణ భారం తగ్గింపు, నెట్వర్క్ ఆధునీకరణ, స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) అవకాశాన్ని ఎంచుకున్న సిబ్బందికి పరిహారం చెల్లింపుల కోసం ఉపయోగపడనున్నాయి.