కేజీ బేసిన్ నుంచి మళ్లీ రిలయన్స్ గ్యాస్
ABN , First Publish Date - 2020-12-19T06:04:33+05:30 IST
ఆంధ్రప్రదేశ్ తీరంలోని కృష్ణ-గోదావరి (కేజీ) బేసిన్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) మళ్లీ గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించింది.

ఆర్-క్లస్టర్లో ఉత్పత్తి ప్రారంభం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ తీరంలోని కృష్ణ-గోదావరి (కేజీ) బేసిన్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) మళ్లీ గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించింది. కేజీ-డీ6 క్షేత్రంలోని ఆర్-క్లస్టర్ నుంచి కొత్తగా గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించినట్టు కంపెనీ తెలిపింది. వచ్చే ఏడాదికల్లా ఈ క్లస్టర్ నుంచి రోజుకు 1.29 కోట్ల ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్ ఉత్పత్తి కానుంది. బ్రిటిష్ పెట్రోలియం (బీపీ)తో కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ బ్లాకులో మరో రెండు గ్యాస్ క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. ఈ మూడు క్లస్టర్లు కాకినాడ తీరం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో లోతట్టు సముద్ర జలాల్లో ఉన్నాయి. 2022 నాటికి మిగతా రెండు క్లస్టర్ల నుంచి సహజ వాయువు ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ మూడు క్లస్టర్ల నుంచి పూర్తి స్థాయిలో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభమైతే దేశీయ గ్యాస్ అవసరాల్లో 25 శాతం తీరుతుందని అంచనా. సముద్ర ఉపరితలం నుంచి దాదాపు 2,000 మీటర్ల లోతున ఉన్న ఈ బావుల నుంచి రిలయన్స్-బీపీ కంపెనీలు గ్యాస్ వెలికితీయబోతున్నాయి. ఆసియాలో ప్రస్తుతం మరే ప్రాంతంలోనూ సముద్ర జలాల్లో ఇంత లోతు నుంచి సహజ వాయువును వెలికి తీయడం లేదు.