ఆఫీస్ స్పేస్కు డిమాండ్
ABN , First Publish Date - 2020-10-28T08:20:59+05:30 IST
కొవిడ్తో మందగించిన హైదరాబాద్ రియల్టీ మార్కెట్ క్రమంగా గాడిన పడుతోంది. నివాస గృహాల కంటే కార్యాలయాల భవనాలకు డిమాండ్ త్వరగా పెరుగుతోంది...

- రికవరీ బాటలో హైదరాబాద్ రియల్టీ
హైదరాబాద్: కొవిడ్తో మందగించిన హైదరాబాద్ రియల్టీ మార్కెట్ క్రమంగా గాడిన పడుతోంది. నివాస గృహాల కంటే కార్యాలయాల భవనాలకు డిమాండ్ త్వరగా పెరుగుతోంది. సెప్టెంబరు త్రైమాసికంలో నగరంలో పలు కంపెనీలు 19 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ను లీజుకు తీసుకున్నాయి. అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే ఇది 31 శాతం ఎక్కువని ప్రముఖ రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ ఇండియా ఒక నివేదికలో ఈ అంశాలు తెలిపింది.
ముందస్తు ఒప్పందాలే అండ
ముందస్తు బుకింగ్లు లేకపోతే సెప్టెంబరు త్రైమాసికంలోనూ హైదరాబాద్ ఆఫీసు స్పేస్ మార్కెట్కు నిరాశే మిగిలేది. ఈ త్రైమాసికంలో జరిగిన లీజు ఒప్పందాల్లో 81 శాతం ముందే జరగడం మార్కెట్కు కలిసొచ్చింది. నిజానికి సెప్టెంబరు త్రైమాసికంలో హైదరాబాద్లో 33.3 లక్షల ఎస్ఎఫ్టీ ఆఫీసు స్పేస్ నిర్మాణాలు పూర్తయ్యాయి. జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ.
రెంటల్స్ యథాతథం
జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబరు త్రైమాసికంలో హైదరాబాద్ ఆఫీసు స్పేస్ రెంటల్స్లో పెద్దగా మార్పు లేదు. కార్యాలయాలకు పనికి వచ్చే భవనాల్లో ఒక చదరపు అడుగు కనీస అద్దె రూ.56.3 నుంచి రూ.56.5కి అంటే కేవలం ఇరవై పైసలు మాత్రం పెరిగిందని జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది.
ప్రధానాంశాలు
- గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లోనే ఎక్కువ నిర్మాణాలు.
- సైబరాబాద్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఆఫీసులు ఖాళీ చేసిన స్థానిక వ్యాపార సంస్థలు, చిన్న ఐటీ కంపెనీలు
- క్యూ3లో ఆఫీసు స్పేస్కు దేశ వ్యాప్తంగా 64 శాతం పెరిగిన డిమాండ్.
- ఆఫీసు స్పేస్ లీజుల్లో తగ్గుతున్న ఐటీ/ఐటీ సేవల కంపెనీల వాటా.
- పెరిగిన ఈ-కామర్స్, ఉత్పత్తి కంపెనీల వాటా