రిలయన్స్ ఎెఫెక్ట్... క్షీణించిన ముఖేష్ సంపద... ఫోర్బ్స్ జాబితాలో మూడు స్థానాలు దిగువకు...
ABN , First Publish Date - 2020-11-03T21:27:16+05:30 IST
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ధర సోమవారం ఒక్కరోజే దాదాపు 9 శాతం పడిపోవడంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 13 లక్షల కోట్ల దిగువకు వచ్చింది. ఈ క్రమంలో... ముఖేష్ అంబానీ సంపద కూడా భారీగా తగ్గిపోయింది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలు ఏడాది ప్రాతిపదికన 15 శాతం క్షీణించాయి.
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ధర సోమవారం ఒక్కరోజే దాదాపు 9 శాతం పడిపోవడంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 13 లక్షల కోట్ల దిగువకు వచ్చింది. ఈ క్రమంలో... ముఖేష్ అంబానీ సంపద కూడా భారీగా తగ్గిపోయింది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలు ఏడాది ప్రాతిపదికన 15 శాతం క్షీణించాయి.
ఇది స్టాక్ పైన ప్రభావం చూపింది. శుక్రవారం రూ. 2,054 కు పడిపోయిన రిలయన్స్ షేర్, సోమవారం 8.69 శాతం దిగజారి రూ. 1,876 కు చేరుకుంది. కాగా... రిలయన్స్కు సంబంధించి ఈ ఏడాది మార్చి 23 తర్వాత ఇదే భారీ పతనం. ఇక ఈ క్రమంలో... షేర్ హోల్డర్లు సైతం రూ. లక్షకోట్ల మేర నష్టపోయారు. దీంతో మార్కెట్ క్యాప్ రూ. 12,64,061.50 లక్షల కోట్లకు పడిపోయింది. గత నెలల్లో రూ. 15 లక్షల కోట్లను దాటిన రిలయన్స్ మార్కెట్ క్యాప్ ఇప్పుడు రూ. 13 లక్షలకోట్ల దిగువకు చేరింది.
మొత్తంమీద ముఖేష్ అంబానీ నికరాదాయంలో 6.8 బిలియన్ డాలర్లు క్షీణించింది. దీంతో ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలో ఆయన 6 వ స్థానం నుండి 9 వ స్థానానికి పడిపోయారు. ఇక... ముఖేష్ నికరాదాయం 71.5 బిలియన్ డాలర్లుగా ఉంది.
వరుస పెట్టుబడులతో ఎగిసిన స్టాక్ ధర...
రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ వెంచర్స్లోకి వరుస పెట్టుబడుల నేపథ్యంలో ఈ స్టాక్ ధర ఓ సమయంలో రూ. 2,300 ను దాటి సెప్టెంబరు 16 న రూ. 2,368 కి చేరింది. ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్టంతో దాదాపు రూ. 500 వరకు(20.7 శాతం) తక్కువగా ఉంది. ముఖేష్ అంబానీ ఇటీవల ఎనర్జీ సెక్టార్ పైన ఆధారపడటం తగ్గించి, డిజిటల్ వ్యాపారంపై మరింతగా దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. రిలయన్స్ షేర్ ఈ ఏడాది దాదాపు 30 శాతం లాభపడింది. అదే సమయంలో సెన్సెక్స్ 4 శాతం నష్టపోయింది. ఇక 2020 లో అంబానీ సంపద 19.1 బిలియన్ డాలర్లు పెరగడంతో బ్లూమ్బర్గ్ బిలియనీర్ ఇండెక్స్లో ప్రపంచ ఆరో కుబేరుడిగా నిలిచారు. నిన్న స్టాక్ పడిపోవడంతో 9వ స్థానానికి పడిపోయారు.
మార్చి కంటే 116 శాతం ఎక్కువ...
మార్చి నెలలో రిలయన్స్ స్టాక్ రూ. 900 దిగువకు వచ్చింది. కరోనా కారణంగా అప్పట్లో మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో అన్ని కంపెనీల స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ఇక అన్-లాక్ తర్వాత మార్కెట్లు కోలుకుంటున్నాయి. రిలయన్స్ స్టాక్ కూడా క్రమంగా ఎగసింది. ఇదే క్రమంలో పెట్టుబడులు కూడా తోడయ్యాయి. దీంతో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది.