భారత్ లో ఇక... మోడల్‌-3 కార్లు...

ABN , First Publish Date - 2020-12-27T22:55:16+05:30 IST

అమెరికన్‌ ఆటో దిగ్గజం టెస్లా ఇంక్‌ కొత్త ఏడాది(2021)లో దేశీయంగా అడుగు పెట్టబోతోంది. ఇందుకణుగుణంగా జనవరి నుంచి మోడల్‌-3 కార్ల బుకింగ్స్‌ ప్రారంభమయ్యే అవకాశాలున్నటు్ల సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. ఎలక్ట్రిక్‌ కార్ల విభాగంలో టెస్లా ఇంక్‌ తయారీ మోడల్‌-3 కార్లు అత్యంత వేగంగా విక్రయయవుతున్న విషయం తెలిసిందే.

భారత్ లో ఇక... మోడల్‌-3 కార్లు...

న్యూఢిల్లీ  : అమెరికన్‌ ఆటో దిగ్గజం టెస్లా ఇంక్‌ కొత్త ఏడాది(2021)లో దేశీయంగా అడుగు పెట్టబోతోంది.  ఇందుకణుగుణంగా జనవరి నుంచి మోడల్‌-3 కార్ల బుకింగ్స్‌ ప్రారంభమయ్యే అవకాశాలున్నటు్ల సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. ఎలక్ట్రిక్‌ కార్ల విభాగంలో టెస్లా ఇంక్‌ తయారీ మోడల్‌-3 కార్లు అత్యంత వేగంగా విక్రయయవుతున్న విషయం తెలిసిందే.


మూడేళ్ళ క్రితం మార్కెట్‌లో ప్రవేశించిన మోడల్‌-3 కార్లు ఎలక్ట్రిక్‌ విభాగంలో ‘అత్యధిక అమ్మకాలు’ రికార్డును సాధించాయి. దీంతో ఈ ఏడాది(2020) టెస్లా ఇంక్‌ షేరు 700 శాతం ర్యాలీ చేసింది. ఇందుకు ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్స్‌లో కంపెనీకి చోటు లభించడం కూడా దోహదం చేసింది. కంపెనీ సెప్టెంబరు త్రైమాసికం అమ్మకాలలో మోడల్‌-3, మోడల్‌-Y కార్ల వాటా 89 శాతానికి చేరడం గమనార్హం..! వెరసి మార్కెట్‌ విలువ(క్యాపిటలైజేషన్‌) రీత్యా ప్రపంచంలోనే టాప్‌ ఆటో కంపెనీగా టెస్లా ఇంక్‌ ఆవిర్భవించింది.


ఇదిలా ఉంటే... భారత మార్కెట్‌లో ప్రవేశించనున్నట్లు ఈ ఏడాది అక్టోబరులోనే టెస్లా ఇంక్‌ సీఈవో ఎలన్‌ మస్క్‌ ట్వీట్‌ ద్వారా స్పష్టం చేశారు. ఇందుకణుగుణంగా 2021 జనవరిలో మోడల్‌-3 కార్ల బుకింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.  తద్వారా జూన్‌ చివరి నాటికి కార్ల డెలివరీని ప్రారంభించాలని టెస్లా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి 2016 లోనే మస్క్‌ మోడల్‌-3 సెడాన్‌ను భారత్‌లో ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు ట్వీట్‌ చేశారు. ఈ బాటలో వీటిని కొత్త ఏడాదిలో అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశీ మార్కెట్లో కార్ల ధర రూ. 55-60 లక్షల మధ్య ఉండవచ్చని చెబుతున్నారు. 


మోడల్ 3 కారు తొలి క్రయదారు పేటీఎం వ్యవస్థాపకుడు... 

ఈకామర్స్‌ చెల్లింపుల కంపెనీ పేటీఎమ్‌ వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ మోడల్‌-3 కారును 2016 లోనే బుక్‌ చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ  అప్పట్లో టెస్లా ఇంక్‌ కార్ల తయారీ ప్లాంటును సందర్శించారు కూడా. కాగా.. పారిశ్రామికవేత్తలు మహేష్‌ మూర్తి, విశాల్‌ గొండాల్‌, సుజయత్‌ అలీ తదితరులు 1,000 డాలర్లు చెల్లించడం ద్వారా మోడల్‌-3 కార్లను బుక్‌ చేసుకున్నట్లు ఆటో వర్గాలు పేర్కొన్నాయి. మోడల్‌-3 కారు ఏకధాటిగా 500 కిలోమీటర్లు ప్రయాణించగలదని, గంటకు 162 మైళ్ల వేగాన్ని సాధించగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక... 0-60 మైళ్ల స్పీడ్‌ను కేవలం 3.1 సెకండ్లలోనే అందుకోగలదని వెల్లడించాయి. ఇప్పటికే టెస్లా ఇంక్‌... మోడల్‌ ఎస్‌, మోడల్‌ ఎక్స్‌ కార్లను ఆశించిన స్థాయిలో విక్రయిస్తున్నట్లు తెలియజేశాయి. 

Updated Date - 2020-12-27T22:55:16+05:30 IST