ఫార్మాలో స్ఫూర్తిదాయక పారిశ్రామికులు కిరణ్, జీవీ ప్రసాద్
ABN , First Publish Date - 2020-04-28T05:33:39+05:30 IST
మాలిక్యూల్స్, బయో ఫార్మాలో అత్యంత ప్రభావశీల పారిశ్రామికవేత్తల జాబితాలో డాక్టర్ రెడ్డీస్ కో చైర్మన్ జీవీ ప్రసాద్, బయోకాన్ అధినేత్రి కిరణ్ మజుందార్ షాకుస్థానం దక్కింది. మెడిసిన్ మేకర్ పవర్ లిస్ట్ 20 పేరిట రూపొందించిన 60 మంది...

బెంగళూరు: మాలిక్యూల్స్, బయో ఫార్మాలో అత్యంత ప్రభావశీల పారిశ్రామికవేత్తల జాబితాలో డాక్టర్ రెడ్డీస్ కో చైర్మన్ జీవీ ప్రసాద్, బయోకాన్ అధినేత్రి కిరణ్ మజుందార్ షాకుస్థానం దక్కింది. మెడిసిన్ మేకర్ పవర్ లిస్ట్ 20 పేరిట రూపొందించిన 60 మంది జాబితాలో భారత్ నుంచి ఈ ఇద్దరే ఉన్నారు. చిన్న మాలిక్యూల్స్, బయో ఫార్మాస్యూటికల్స్, అడ్వాన్స్డ్ మెడిసిన్ విభాగాల్లో నవ్యపథం సృష్టించిన వారిని ఈ జాబితాలోకి తీసుకోగా జీవీ ప్రసాద్ (చిన్న మాలిక్యూల్స్), కిరణ్ మజుందార్ (బయో ఫార్మా) ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు.
ఒక్కో విభాగంలో 20 మందికి స్థానం దక్కింది. వారందరూ వృత్తిపరమైన నైపుణ్యాలతోనే పరిశ్రమను ముందుకు నడుపుతున్నారని, కొత్త ఔషధాలు కనుగొనడం ద్వారా లక్షలాది ప్రాణాలను కాపాడుతున్నారని నివేదిక ప్రశంసించింది. ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న కోవిడ్-19 మహమ్మారికి వీలైనంత త్వరలో కొత్త ఔషధాలు అభివృద్ధి చేసి దాని నిర్మూలనలో కూడా వారు ముందువరుసలో నిలుస్తారన్న ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా కిరణ్ మజుందార్ షాకు వరుసగా ఆరోసారి ఈ గౌరవం లభించడం తమకు గర్వకారణమని బయోకాన్ తెలిపింది.
