చెప్పింది కొండంత... ఇచ్చింది గోరంత
ABN , First Publish Date - 2020-05-18T07:00:09+05:30 IST
నరేంద్ర మోదీ సర్కార్ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీపై అంతర్జాతీయ సంస్థలు పెదవి విరుస్తున్నాయి. ఇందులో బడ్జెట్ ఖర్చు రూ.2.02 లక్షల కోట్లు మాత్రమేనని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్...
![చెప్పింది కొండంత... ఇచ్చింది గోరంత](https://media.andhrajyothy.com/appimg/galleries/2020051801270988/05182020013003n64.jpg)
- ప్యాకేజీపై ఈవై ఇండియా
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కార్ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీపై అంతర్జాతీయ సంస్థలు పెదవి విరుస్తున్నాయి. ఇందులో బడ్జెట్ ఖర్చు రూ.2.02 లక్షల కోట్లు మాత్రమేనని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) ఒక నివేదికలో పేర్కొంది. మొత్తం ప్యాకేజీలో ఇది 10 శాతం కూడా ఉండదని స్పష్టం చేసింది. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని అదుకునేందుకు జీడీపీలో 10 శాతానికి సమానమైన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని కేంద్రం ఐదు విడతలుగా ప్రకటించింది. ప్రభుత్వం కొండంత ఇస్తామని చెప్పి... గోరంత ఇచ్చిందని ఈవై పరోక్షంగా విమర్శించింది. ఈ ఉద్దీపన ప్యాకేజీలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ ప్రకటించిన నిధుల చలామణి పెంపు చర్యల ద్వారానే రూ.8.01 లక్షల కోట్లు అందుబాటులోకి వచ్చిన విషయాన్ని ఈవై గుర్తు చేసింది.
ఈ ప్యాకేజీ ఖర్చులో కేవలం 10 శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వంపై అదనపు భారం మోపుతుంది. మిగతా నిధులు ఆర్బీఐ ప్రకటించిన ద్రవ్య చలామణి పెంపు చర్యలు, ప్రభుత్వ రుణ హామీ పథకం, బీమా పథకాల ద్వారా సమకూరతాయి.
- డీకే శ్రీవాస్తవ, ఈవై ఇండియా