మాాంద్యంలోకి భారత్
ABN , First Publish Date - 2020-11-13T08:33:40+05:30 IST
కరోనా దెబ్బకు భారత్ చరిత్రలో తొలిసారిగా ఆర్థిక మాంద్యంలోకి జారుకుందని ఆర్బీఐ ఆర్థికవేత్తలు అంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి...
- క్యూ2 వృద్ధి రేటు -8.6 శాతానికి పతనం
- ఆర్బీఐ బులిటెన్లో ఆర్థికవేత్తల అంచనా
న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు భారత్ చరిత్రలో తొలిసారిగా ఆర్థిక మాంద్యంలోకి జారుకుందని ఆర్బీఐ ఆర్థికవేత్తలు అంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) జీడీపీ వృద్ధి రేటు -8.6 శాతానికి క్షీణించవచ్చని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకేల్ పాత్రతో కూడిన ఆర్థికవేత్తల బృందం అంచ నా వేసింది. ఆర్థికవేత్తలు నౌకాస్టింగ్ పద్ధతిన వృద్ధిని అంచనా వేశారు. ఈ జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి ఏకంగా -23.9 శాతానికి పతనమైంది. వృద్ధిరేటు వరుసగా రెండు త్రైమాసికాలపాటు రుణాత్మక స్థాయికి పతనమైన పక్షంలో సాంకేతికంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకున్నట్లుగా పరిగణిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) మొత్తానికి వృద్ధి పతనం -9.5 శాతంగా నమోదుకావచ్చని ఆర్బీఐ గతంలో అంచనా వేసింది. ఈ నెల 27న కేంద్ర గణాంకాల కార్యాలయం(సీఎ్సఓ) క్యూ2 జీడీపీ వృద్ధి గణాంకాలను విడుదల చేయనుంది.
ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో వరుసగా రెండు త్రైమాసికాలపాటు వృద్ధి క్షీణతను నమోదు చేసుకోవడం ద్వారా భారత్ సాంకేతికంగా మాంద్యంలోకి జారుకోనుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయని.. దాంతో వృద్ధి క్షీణత రేటు క్రమంగా తగ్గనుందని వారు పేర్కొన్నారు. బుధవారం నాడు ఆర్బీఐ విడుదల చేసిన నెలవారీ బులిటెన్లో ఎకనామిక్ యాక్టివిటీ ఇండెక్స్ పేరుతో రాసిన ఆర్టికల్లో ఆర్థికవేత్తలు ఈ అభిప్రాయాలు వ్యక్తపరిచారు.
వృద్ధి అంచనాలు మెరుగుపర్చిన మూడీస్
మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్.. భారత జీడీపీ వృద్ధి అంచనాలను కాస్త మెరుగుపర్చింది. 2020(క్యాలెండర్ ఏడాది)లో వృద్ధి రేటు క్షీణత -8.9 శాతానికి పరిమితం కావచ్చని తాజా నోట్లో పేర్కొంది. ఇంతక్రితం సంస్థ వృద్ధి పతనాన్ని -9.6 శాతంగా అంచనా వేసింది. కరోనా కట్టడి కోసం విధించిన దీర్ఘకాలిక, కఠిన లాక్డౌన్ సడలింపుతో ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని మూడీస్ పేర్కొంది. అయితే, పునరుద్ధరణ ప్రక్రియ సమగ్రంగా జరగటం లేదని అభిప్రాయపడింది.