మానవ మూలధన సూచీలో భారత్కు 116 వ స్థానం
ABN , First Publish Date - 2020-09-18T05:48:23+05:30 IST
ప్రపంచ బ్యాంక్.. మానవ మూలధన సూచీ (హ్యుమన్ క్యాపిటల్ ఇండెక్స్)లో భారత్ ఈ ఏడాది 116వ స్థానంలో నిలిచింది...

వాషింగ్టన్: ప్రపంచ బ్యాంక్.. మానవ మూలధన సూచీ (హ్యుమన్ క్యాపిటల్ ఇండెక్స్)లో భారత్ ఈ ఏడాది 116వ స్థానంలో నిలిచింది. 2018తో పోల్చితే భారత స్కోరు 0.44 నుంచి 0.49 పాయింట్లకు పెరిగిందని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. ప్రపంచ జనాభాలో 98 శాతం వాటా ఉన్న 174 దేశాల్లో ఆరోగ్య, విద్యా రంగాలు సహా విభిన్న రంగాల గణాంకాలు 2020 మానవ మూలధన సూచీలో భాగంగా ఉన్నాయి. గత ఏడాది 157 దేశాలను పరిగణనలోకి తీసుకోగా భారత్ 115వ స్థానంలో ఉంది. ఈ ఏడాది మార్చి చివరి నాటి గణాంకాల ఆధారంగా దీన్ని రూపొందించారు.
కరోనా మహమ్మారికి ముందు కాలంలో అన్ని దేశాలు కూడా పిల్లల్లో సామర్థ్యాల విషయంలో నిలకడగా పురోగతి సాధించాయని ఆ నివేదిక తెలిపింది. పురోగతి సాధించినా కూడా పిల్లలు తమలోని 56 శాతం సామర్థ్యాలు మాత్రమే వినియోగించుకోగలుగుతున్నారని, ఈ విషయంలో దశాబ్ది కాలంగా ఏర్పడిన పురోగతికి ఈ మహమ్మారి సవాలు విసురుతున్నదని స్పష్టం చేసింది. ప్రధానంగా కుటుంబాల్లో ఆహార అభద్రత, పేదరికం పెరుగుదల కనిపిస్తున్నట్టు ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ తెలిపారు. పేదల జీవనోపాధికి మద్దతు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ భారత అధికారులతో కలిసి పని చేస్తున్నట్టు చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అసమానతలు పెంచిందన్నారు.