ధన త్రయోదశి మెరిసేనా?
ABN , First Publish Date - 2020-11-13T08:21:27+05:30 IST
ఏటా ధన త్రయోదశికి చిన్న మెత్తు బంగారమైనా కొనాలనేది కోట్లాది మంది భారతీయుల కోరిక. అలా చేస్తే ఏడాదంతా లక్ష్మీ దేవి ఇంట్లో కొలువై ఉంటుందని నమ్మకం. కాని ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా అధిక శాతం మంది తీవ్ర ఆర్థిక ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు...
- చుక్కలంటిన ధరలతో కొనుగోలుదారులు దూరం
- నగల వ్యాపారులు డీలా
న్యూఢిల్లీ: ఏటా ధన త్రయోదశికి చిన్న మెత్తు బంగారమైనా కొనాలనేది కోట్లాది మంది భారతీయుల కోరిక. అలా చేస్తే ఏడాదంతా లక్ష్మీ దేవి ఇంట్లో కొలువై ఉంటుందని నమ్మకం. కాని ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా అధిక శాతం మంది తీవ్ర ఆర్థిక ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. పైగా చుక్కలంటిన బంగారం, వెండి ధరల కారణంగా ప్రజలు కొను గోళ్లకు దూరంగా ఉంటున్నారు. దీని ప్రభావంతో ఆభరణాల దుకాణాలు వెలవెలబోతున్నాయి. ఈ ధన త్రయోదశి కలిసొచ్చేలా లేదని నగల వ్యాపారులు డీలా పడిపోయారు. గత ఏడాది ధన త్రయోదశితో పోలిస్తే ఈ సంవత్సరం పసిడి, వెండి, వాటితో చేసిన నగల అమ్మకాలు 30 శాతం తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆర్థిక మందగమనంతో గత ఏడాది ధన త్రయోదశికి కూడా అమ్మకాలు 20 నుంచి 30 శాతం పడిపోయాయి.
చుక్కలంటిన ధర: దేశంలో 10 గ్రాముల 24 కేరట్ల మేలిమి బంగారం ధర ప్రస్తుతం రూ.51,000 నుంచి రూ.53,000 మధ్య పలుకుతోంది. గత ఏడాది ధన త్రయోదశితో పోలిస్తే ఇది 35 శాతం ఎక్కువ. కిలో వెండి ధర రూ.47,680 నుంచి రూ.62.000కు చేరింది. ఈ ధరలు ఎంతకాలం నిలబడతాయో తెలియడం లేదు. కొవిడ్ వ్యాక్సిన్ వచ్చిన వెంటనే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే, బులియన్ మార్కెట్ మళ్ళీ నేల చూపులు చూస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో ఏటా ధన త్రయోదశికి సెంటిమెంట్గా బంగారం లేదా వెండి కొనే వ్యక్తులూ ఒకటికి రెండు సార్లు అలోచిస్తున్నారు. దీంతో ఈ సంవత్సరం ధన త్రయోదశి అమ్మకాలపైనా బులియన్ మార్కెట్ వర్గాలు పెద్ద ఆశాభావంతో లేవు.