'బంగారు' తల్లులు

ABN , First Publish Date - 2020-05-28T09:17:07+05:30 IST

భారతీయులు బంగారం ప్రియులు. ముఖ్యంగా మన మహిళలకు నగలపై మోజెక్కువే. పండగ.. పెళ్లి..

'బంగారు' తల్లులు

  • 60% మహిళల వద్ద బంగారు నగలు 
  • గోల్డ్‌ జువెలరీకి కీలక మార్కెట్‌గా భారత్‌
  • ప్రపంచ స్వర్ణ మండలి తాజా నివేదిక 

ముంబై: భారతీయులు బంగారం ప్రియులు. ముఖ్యంగా మన మహిళలకు నగలపై మోజెక్కువే. పండగ.. పెళ్లి.. ఉత్సవమేదైనా వారికి ఆభరణమే ప్రధాన అలంకరణ. దేశంలోని 60 శాతం నారీమణులు ఇప్పటికే బంగారు ఆభరణాలు కలిగి ఉన్నారని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా సర్వే నివేదిక వెల్లడించింది. మరో 37 శాతం మహిళలు భవిష్యత్‌లో స్వర్ణ శోభితమవ్వాలని ఆరాటపడుతున్నారట. గోల్డ్‌ జువెలరీకి భారత్‌ కీలక మార్కెట్‌ అని రిపోర్టు పేర్కొంది. ఫ్యాషన్‌ ఉత్పత్తుల కొనుగోలు విషయానికొస్తే, డిజైనర్‌ దుస్తులు లేదా చీరల తర్వాత స్థానం పసిడి ఆభరణాలదేనని సర్వేలో పాల్గొన్న మహిళలు తేల్చారు. ‘రిటైల్‌ గోల్డ్‌ ఇన్‌సైట్స్‌: ఇండియా జువెలరీ’ పేరుతో డబ్ల్యూజీసీ విడుదల చేసిన నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. 


  1. ఇప్పటివరకు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయలేదని సర్వేలో వెల్లడించిన వారు 37 శాతం. అందులో 44 శాతం మహిళలు గ్రామీణ, 30 శాతం పట్టణ ప్రాంతాలకు చెందినవారు. 
  2. పట్టణ మహిళలు భవిష్యత్‌ భద్రత, సంపద విలువ పెంచుకునే దృష్ట్యా బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారు. గ్రామీణ మహిళలు సమాజంలో గౌరవం పెంచుకునేందుకు బంగారు ఆభరణాలు ధరించాలనుకుంటున్నారు. 
  3. 18-24 ఏళ్ల మధ్య వయసు కలిగిన యువ మహిళలకు మాత్రం బంగారంపై మోజు తగ్గుతోంది. వీరిలో 33 శాతం గడిచిన ఏడాదికాలంలో గోల్డ్‌ జువెలరీ కొనుగోలు చేసినప్పటికీ.. భవిష్యత్‌లో కొనుగోలు చేసే అవకాశాలు తక్కువే. ముఖ్యంగా పట్టణ యువ మహిళల్లో ఈ ధోరణి ఎక్కువగా కన్పిస్తోంది. 
  4. భారత్‌లోని 1,017 మంది గ్రామీణ మహిళలతో ముఖాముఖిగా, 1,023 మంది పట్టణ మహిళలతో ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేసి ఈ నివేదికను రూపొందించినట్లు డబ్ల్యూజీసీ వెల్లడించింది. 


భారత్‌ మహిళలు కలిగి ఉన్న ఫ్యాషన్‌ ఉత్పత్తులు 

డిజైనర్‌ దుస్తులు/చీరలు 62%

బంగారు ఆభరణాలు 60%

వెండి ఆభరణాలు 57%

లగ్జరీ కాస్మెటిక్స్‌ 50%

డిజైనర్‌ యాక్సెసరీస్‌ 49%

వియరబుల్‌ గ్యాడ్జెట్స్‌ 44%

స్మార్ట్‌ఫోన్‌ లేదా ట్యాబ్లెట్‌ 41%

ఖరీదైన చేతి గడియారాలు 32%

వజ్రాభరణాలు 26%

Updated Date - 2020-05-28T09:17:07+05:30 IST