ఫ్రెష్ టు హోమ్కు రూ.895 కోట్ల నిధులు
ABN , First Publish Date - 2020-11-01T08:35:49+05:30 IST
తాజా చేపలు, మాంసాన్ని విక్రయిస్తున్న ఈ-కామర్స్ సంస్థ ఫ్రెష్ టు హోమ్ 12.1 కోట్ల డాలర్ల (సుమారు రూ.895 కోట్లు) నిధులను సమీకరించింది. ఇన్వె్స్టమెంట్ కార్పొరేషన్ ఆఫ్ దుబాయ్ (ఐసీడీ) సహా వివిధ ఇన్వెస్టర్ల నుంచి ఈ మొత్తాలను సమీకరించినట్లు సంస్థ సీఈఓ శాన్ కడవిల్...
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): తాజా చేపలు, మాంసాన్ని విక్రయిస్తున్న ఈ-కామర్స్ సంస్థ ఫ్రెష్ టు హోమ్ 12.1 కోట్ల డాలర్ల (సుమారు రూ.895 కోట్లు) నిధులను సమీకరించింది. ఇన్వె్స్టమెంట్ కార్పొరేషన్ ఆఫ్ దుబాయ్ (ఐసీడీ) సహా వివిధ ఇన్వెస్టర్ల నుంచి ఈ మొత్తాలను సమీకరించినట్లు సంస్థ సీఈఓ శాన్ కడవిల్ వెల్లడించారు. సీ-సీరీస్ రౌండ్లో భాగంగా ఈ నిధులను సమకూర్చుకున్నట్లు ఆయన చెప్పారు. కొవిడ్ కారణంగా వినియోగదారుల వ్యవహార శైలిలో మార్పులు వచ్చాయన్నారు. వినియోగదారులు రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తుండటంతో ఎంతగానో కలిసివస్తోందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆన్లైన్లో తమ ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని, మున్ముందు మరింత మార్కెట్ వాటాను చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. తాజాగా సమీకరించిన నిధులను భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఉపయోగించనున్నట్లు తెలిపారు. 2019లో భారత్లో కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించింది. బెంగళూరు, హైదరాబాద్, పుణెతో పాటు కేరళ, తమిళనాడు, యూఏఈల్లో నేరుగా మత్స్యకారుల నుంచి చేపలు, రైతుల నుంచి కోళ్లు, గొర్రెలను కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఫ్రెష్ టు హోమ్ ప్రతి నెల సుమారు 15 లక్షల బీ2సీ ఆర్డర్లను అందుకుంటోంది. కంపెనీ వార్షిక విక్రయాలు దాదాపు రూ.600 కోట్లుగా ఉన్నాయి.