ఎస్హెచ్జీలు, రైతన్నలకు బీఓబీ ఆర్థిక సాయం
ABN , First Publish Date - 2020-04-08T06:24:39+05:30 IST
కోవిడ్-19 నేపథ్యంలో ఫండింగ్ అవసరాలు తీర్చేందుకు ప్రతి మహిళా స్వయం సహాయక బృందాల (ఎస్హెచ్జీ)కు కనిష్ఠంగా రూ.30,000, గరిష్ఠంగా రూ.లక్ష వంతున ఆర్థిక సహాయం అందించనున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ప్రకటించింది.

ముంబై: కోవిడ్-19 నేపథ్యంలో ఫండింగ్ అవసరాలు తీర్చేందుకు ప్రతి మహిళా స్వయం సహాయక బృందాల (ఎస్హెచ్జీ)కు కనిష్ఠంగా రూ.30,000, గరిష్ఠంగా రూ.లక్ష వంతున ఆర్థిక సహాయం అందించనున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ప్రకటించింది. క్యాష్ క్రెడిట్ లేదా ఓవర్డ్రాఫ్ట్ లేదా టర్మ్ రుణం కింద ఈ సహాయం అందిచనున్నట్టు తెలిపింది. ఎస్హెచ్జీలు ఈ మొత్తాలను 24 నెలల్లో చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు, పాడిపరిశ్రమ, ఫిషరీస్ విభాగాలకు చెందిన ఉత్పత్తులు తయారుచేసే వారికి కూడా ఆర్థిక సహా యం అందించనున్నట్టు పేర్కొంది.
వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలకు 36 నెలల కాలపరిమితిలో తిరిగి చెల్లించే విధానంలో గరిష్ఠంగా రూ.5 లక్షలు, పాడి పరిశ్రమ, ఫిషరీస్ రైతులకు గరిష్ఠంగా రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలియచేసింది. మహిళా ఎస్హెచ్జీలు ఆ రుణా న్ని నెలవారీ లేదా త్రైమాసిక వాయిదాల్లో చెల్లించవచ్చు. వ్యవసాయదారులు, ఎస్హెచ్జీలకు అందించే రుణంపై ఆ మొత్తం అందించిన నాటి నుంచి 6 నెలల మారటోరియం వర్తింపచేస్తారు. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డులున్న వారందరికీ వ్యవసాయ ఖర్చుల కోసం కనిష్ఠంగా రూ.10 వేలు, గరిష్ఠంగా రూ.50 వేలు సహాయం అందించనున్నట్టు ప్రకటించింది.