బ్యాంకింగ్‌లోకి కార్పొరేట్ల ఎంట్రీ!

ABN , First Publish Date - 2020-11-21T08:02:23+05:30 IST

టాటా, బిర్లా, రిలయన్స్‌, అదానీ, ఎల్‌ అండ్‌ టీ వంటి దేశీయ కార్పొరేట్‌ దిగ్గజాలు భవిష్యత్‌లో బ్యాంకింగ్‌ సేవల్లో ప్రవేశించేందుకు అవకాశాలున్నాయి. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌లోకి బడా కా ర్పొరేట్‌ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలనూ

బ్యాంకింగ్‌లోకి కార్పొరేట్ల ఎంట్రీ!

ఎన్‌బీఎ్‌ఫసీలు బ్యాంక్‌లుగా మారే చాన్స్‌ 

ప్రైవేట్‌ బ్యాంక్‌ ప్రమోటర్ల వాటా పెంపు 

కొత్తగా బ్యాంక్‌ లైసెన్సుల జారీకి 

కనీస మూలధన అర్హత రూ.1,000 కోట్లు 

ప్రతిపాదించిన ఆర్‌బీఐ వర్కింగ్‌ గ్రూప్‌ 


ముంబై: టాటా, బిర్లా, రిలయన్స్‌, అదానీ, ఎల్‌ అండ్‌ టీ వంటి దేశీయ కార్పొరేట్‌ దిగ్గజాలు భవిష్యత్‌లో బ్యాంకింగ్‌ సేవల్లో ప్రవేశించేందుకు అవకాశాలున్నాయి. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌లోకి బడా కా ర్పొరేట్‌ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలనూ అనుమతించాలని ఆర్‌బీఐ ఇంటర్నల్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సిఫారసు చేసింది. అయితే, బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టంలో అవసరమైన సవరణలు చేయడంతోపాటు నియంత్రణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేశాకే వీరిని ప్రైవేట్‌ బ్యాంక్‌ల ప్రమోటర్లుగా అనుమతించాలని ప్రతిపాదించింది. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగంలో యాజమాన్య మార్గదర్శకాలు, కార్పొరేట్‌ వ్యవస్థను సమీక్షించేందుకు 2020 జూన్‌ 12న ఆర్‌బీఐ అంతర్గతంగా ఓ వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఈ బృందం సమర్పించిన నివేదికను ఆర్‌బీఐ శుక్రవారం విడుదల చేసింది. నివేదికలోని మరిన్ని సిఫారసులు.. 


  • పదిహేనేళ్లలో ప్రైవేట్‌ బ్యాంక్‌ల ప్రమోటర్ల వాటా పరిమితిని ప్రస్తుతమున్న 15 శాతం నుంచి 26 శాతానికి పెంచాలి. 
  • ఆర్థికంగా మెరుగైన పనితీరును కనబరుస్తున్న బడా నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎ్‌ఫసీ).. ప్రైవేట్‌ బ్యాంక్‌లుగా మారేందుకు అవకాశం కల్పించాలి. కనీసం 10 ఏళ్లుగా కార్యకలాపాలు కొనసాగిస్తూ, రూ.50,000 కోట్లు.. అంతకు మించి ఆస్తులున్న ఎన్‌బీఎ్‌ఫసీల (కార్పొరేట్‌ గ్రూప్‌లకు చెందినవి సైతం)కు ఇందుకు అర్హత కల్పించాలి. 
  • కొత్తగా ప్రైవేట్‌ బ్యాంక్‌ లైసెన్సుల జారీకి కనీస మూలధన అర్హతను ప్రస్తుతమున్న రూ.500 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పెంచాలి. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ లైసెన్సుల జారీకి కనీస మూలధన పరిమితిని రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పెంచాలి. 


పీఎస్‌బీల కొనుగోలుకూ అనుమతి? 

త్వరలో ప్రైవేటీకరించనున్న ప్రభుత్వ రంగ బ్యాంక్‌(పీఎ్‌సబీ)ల్లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసేందుకు కార్పొరేట్‌ కంపెనీలు, విదేశీ బ్యాంక్‌లనూ అనుమతించాలని మోదీ సర్కారు యోచిస్తోందట. ఈ విషయంపై కేంద్ర ప్రభు త్వం, ఆర్‌బీఐ మధ్య ప్రాథమిక చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్‌ రంగ గత అనుభవాలను, సాధ్యాసాధ్యాలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. నాన్‌ ఫైనాన్షియల్‌ సంస్థ నుంచి 60 శాతం కంటే తక్కువ టర్నోవర్‌ లభిస్తున్న కార్పొరేట్‌ గ్రూప్‌లు బ్యాంక్‌ లైసెన్సుకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి లేదు. అంతేకాదు, ఈక్విటీ వాటా కూడా 10 శాతానికి మించకూడదు.


కార్పొరేట్ల రంగ ప్రవేశంతో బ్యాంకింగ్‌ రంగ స్థిరత్వానికి భంగం కలగవచ్చన్న భయంతో ఆర్‌బీఐ ఇప్పటివరకు వీటిని అనుమతించలేదు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మూడు విడతల్లో జరిగిన విలీనాలతో పీఎ్‌సబీలు డజనుకు తగ్గాయి. ఈ సంఖ్య ను 4-5కు పరిమితం చేయాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగా ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర , పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌తోపాటు మరిన్ని పీఎ్‌సబీలను  ప్రైవేటీకరించే అవకాశం ఉంది. 

Updated Date - 2020-11-21T08:02:23+05:30 IST