కరోనా లోన్
ABN , First Publish Date - 2020-05-03T05:45:54+05:30 IST
బడా పారిశ్రామికవేత్తల నుంచి చిన్న వ్యాపారుల వరకు.. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ల నుంచి సగటు వేతన జీవుల వరకు.. కరోనా కష్టాలు అందర్నీ కుదిపేస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులకు రాబడి...
బడా పారిశ్రామికవేత్తల నుంచి చిన్న వ్యాపారుల వరకు.. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ల నుంచి సగటు వేతన జీవుల వరకు.. కరోనా కష్టాలు అందర్నీ కుదిపేస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులకు రాబడి నిలిచిపోయింది. చాలా కంపెనీలు ఉద్యోగుల జీతాలకు కోతలు పెడుతున్నాయి. ఈ గడ్డు కాలంలో వీరికి వ్యక్తిగత రుణాలిచ్చేందుకు పలు బ్యాంకులు ముందుకొస్తున్నాయి.
- రూ.3-5 లక్షల వ్యక్తిగత రుణం
- ఆఫర్ చేస్తున్న బ్యాంకులు
- 8-15 శాతం వరకు వార్షిక వడ్డీ..
- ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు
మీకు శాలరీ అకౌంట్ ఉందా..? లేక గతంలో తీసుకున్న రుణాన్ని క్రమంగా తప్పకుండా చెల్లిస్తూ వస్తున్నారా..? అయితే, ఈ అవకాశం మీ కోసమే. మీలాంటి వాళ్లకు పలు బ్యాంకులు ‘కోవిడ్-19 వ్యక్తిగత రుణం’ ఆఫర్ చేస్తున్నాయి. కరోనా కష్టాల నుంచి గట్టెక్కేందుకు వీలుగా రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలందిస్తామంటున్నాయి. సాధారణంగా వ్యక్తిగత రుణాలపై వార్షిక వడ్డీ 18-24 శాతం స్థాయిలో ఉంటుంది. కోవిడ్ పర్సనల్ లోన్స్ మాత్రం కనిష్ఠంగా 8 శాతం నుంచి గరిష్ఠంగా 15 శాతం వడ్డీకే లభించనున్నాయి. అంతేకాదు, ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహా యింపు లభించనుంది. క్రెడిట్ స్కోర్ కూడా 650 పాయింట్లు ఉంటే చాలంటున్నాయి బ్యాంకులు. 3 నుంచి 5 ఏళ్ల కాలపరిమితితో ఈ రుణాలను ఆఫర్ చేస్తున్నాయి.
ఏయే బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి..
- పంజాబ్ నేషనల్ బ్యాంక్
- బ్యాంక్ ఆఫ్ బరోడా
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
- బ్యాంక్ ఆఫ్ ఇండియా
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
తీసుకోవచ్చా..?
ఈ రుణాల్లో చౌక వడ్డీ రేటు అత్యంత ఆకర్షణీయ అంశమని ఫైనాన్షియల్ ప్లానర్లు అంటున్నారు. ప్రస్తుత ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు మంచి ప్రత్యామ్నాయమన్నారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి ఎప్పటికి అదుపులోకి వస్తుందని స్పష్టత లేనందున అదనపు రుణ భారాన్ని నెత్తిన వేసుకోకపోవడమే మేలని వారు అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో అవ్యసర నిధిని ఉయోగించుకోవడం లేదా బ్యాంక్ అకౌంట్లోని కొద్దిపాటి సొమ్ముతో సరిపెట్టుకోవడం మేలంటున్నారు. మరే గత్యంతరం లేనట్లయితేనే దీన్ని ప్రత్యామ్నా యంగా పరిగణించాలని అంటున్నారు.
షరతులు వర్తిస్తాయ్..
బ్యాంకులు కొన్ని షరతులతో ఈ రుణాలను మంజూరు చేస్తున్నాయి. అవేంటో చూద్దాం..
- బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) విషయానికొస్తే, కనీసం ఏడాది కాలం నుంచి తమ బ్యాంక్ ఖాతా నుంచి వేతనం అందుకుంటున్న వారికి మాత్రమే కరోనా లోన్ను ఆఫర్ చేస్తోంది. ఇప్పటికే బ్యాంక్ నుంచి గృహ లేదా వ్యక్తిగత రుణం తీసుకున్న వారూ అర్హులేనంటోంది.
- సహ్యోగ్ కోవిడ్-19 పేరుతో రుణం అందిస్తోన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ).. తమ వద్ద శాలరీ అకౌంట్ కలిగిన వారికి మాత్రమేనంటోంది. ఈ మధ్యనే పీఎన్బీలో విలీనమైన యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ).. శాలరీ అకౌంట్ హోల్డర్లకూ ఈ ఆఫర్ వర్తించనుంది.
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) తన గృహ రుణ ఖాతాదారులకు ఈ రుణాన్ని ఆఫర్ చేస్తోంది. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) తన గృహ, వాహన రుణగ్రహీతలకు, స్థిరాస్తి తాకట్టుపై రుణం తీసుకున్న వారికి ఈ లోన్ను అందుబాటులోకి తెచ్చింది.
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) సైతం కనీసం 12 నెలల నుంచి తమ బ్యాంక్ ఖాతా ద్వారా వేతనం లేదా పెన్షన్ పొందుతున్న వారికి ఈ లోన్ ఆఫర్ చేస్తోంది. కనీసం ఏడాది క్రితం తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లిస్తున్న వారికీ అందుబాటులోకి తెచ్చింది.