కంపెనీలు విలవిల
ABN , First Publish Date - 2020-03-21T06:49:54+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి పట్ల భారత కంపెనీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమ కంపెనీల కార్యకలాపాలపై భారీగా ప్రభా వం పడటమే కాకుండా నగదు ప్రవాహం కూడా తగ్గిపోయినట్టు చెబుతున్నాయి. పరిశ్రమ సంఘం భారత వాణిజ్య, పరిశ్రమ సంఘాల సమాఖ్య (ఫిక్కీ) నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. తమ వ్యాపార
ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి పట్ల భారత కంపెనీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమ కంపెనీల కార్యకలాపాలపై భారీగా ప్రభా వం పడటమే కాకుండా నగదు ప్రవాహం కూడా తగ్గిపోయినట్టు చెబుతున్నాయి. పరిశ్రమ సంఘం భారత వాణిజ్య, పరిశ్రమ సంఘాల సమాఖ్య (ఫిక్కీ) నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. తమ వ్యాపార కార్యకలాపాలపై ప్రభా వం పడినట్టు 50 శాతానికి పైగా కంపెనీలు తెలిపాయి. దాదాపు 80 శాతం కంపెనీలకు నగ దు ప్రవాహం తగ్గిపోయింది. దీని మూలంగా కంపెనీలకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ మహమ్మారి మూలంగా భారత ఆర్థిక వ్యవ స్థ కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. డిమాండ్, సప్లయ్ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఫలితంగా కంపెనీలతో పాటు ఆర్థిక వ్యవస్థ వృద్ధి గాడితప్పవచ్చన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. వస్తుసేవల గిరాకీ, సరఫరాపై నేరుగా ప్రభావం పడటమేకాకుండా ఆర్థిక వ్యవస్థలో మందగమనంతో నగదు ప్రవా హం బాగా తగ్గినట్టు ఫిక్కీ సభ్యులు చెబుతున్నారు. దీనివల్ల అన్ని రకాల చెల్లింపుల (ఉద్యోగుల వేతనాలు, వడ్డీ, రుణాల తిరిగి చెల్లింపు, పన్నులు)పై ప్రభావం పడుతోందని ఫిక్కీ పేర్కొంది.
ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో మందగమనం నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి కేవలం 4.7 శాతంగానే ఉంది. గత ఆరేళ్ల కాలంలో ఇదే తక్కు వ. తాజాగా కరోనాతో ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించాలి..
ప్రస్తుత పరిస్థితుల్లో పరిశ్రమను ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఫిక్కీ పేర్కొంది. ద్రవ్యపరంగా, విత్తపరంగానే కాకుండా ఆర్థిక మార్కెట్పరంగా చర్యలు తీసుకోవడం వల్ల వ్యాపార సంస్థలు, ప్రజలను సంక్షోభం నుంచి బయటపడేయవచ్చని సూచించింది. భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) విధానపరమైన రేట్లను ఒక శాతం వరకు తగ్గించాలని, దీని వల్ల భారత పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థకు మద్దతు లభిస్తుందని ఫిక్కీ పేర్కొంది. ప్రొవిజనింగ్ చేయకుండా చెల్లింపుల రీషెడ్యూల్కు బ్యాంకులకు అవకాశం కల్పించాలని తెలిపింది. కంపెనీలు, ఎన్బీఎ్ఫసీలు, బ్యాంకులకు ప్రత్యేక నగదు లభ్యత మద్దతును కల్పించాలని సూచించింది. పన్ను వసూళ్లు తగ్గినా ప్రభుత్వం మాత్రం మూలధన వ్యయ ప్రణాళికల్లో కోత విధించవద్దని సూచించింది. ఇదిలా ఉంటే.. సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతానికి పైగా సభ్యులు తమ సప్లయ్ చెయిన్లు దెబ్బతిన్నాయని, రానున్నకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారవచ్చని పేర్కొన్నారు. పరిస్థితి పూర్వస్థాయికి రావడానికి మూడు నెల లు పడుతుందని 42 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఆభరణాలకు గిరాకీ తగ్గింది: డబ్ల్యూజీసీ
కరోనా కార ణంగా పసిడి మార్కెట్లో సెంటిమెంట్ బలహీనంగా మారిందని, ఆభరణాలు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు అంతగా ఆసక్తి చూపడం లేదని, ఫలితంగా గిరాకీ తగ్గిపోయిందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) చెబుతోంది. కరోనా దెబ్బతో అన్ని ఆస్తుల మాదిరిగానే బంగారంపైనా ప్రభావం పడింది. ఇతర ఆస్తుల్లో నష్టాలను కవర్ చేసుకునేందుకు చాలా మంది బంగారాన్ని నగదులోకి మార్చుకుంటున్నారని, ఫలితంగా ధరల్లో హెచ్చుతగ్గులు నమోదు అవుతున్నాయని డబ్ల్యూజీసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) సోమసుందరం పీఆర్ తెలిపారు.
సిమెంట్ డిమాండ్ తగ్గుదల తాత్కాలికమే
కరోనా మూలంగా చాలా ప్రాంతాల్లో నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఫలితంగా సిమెంట్ డిమాండ్ తగ్గుముఖం పట్టింది. అయితే సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత డిమాండ్ మళ్లీ పుంజుకుంటుందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ తెలిపింది. తాజా ఆంక్షల మూలంగా మార్చి నుంచి కొంత కాలం పాటు డిమాండ్పై ప్రభావం ఉంటుందని, సాధారణ పరిస్థితులు రాగానే గిరాకీ పెరుగుతుందని పేర్కొంది.
తక్షణ చర్యలు తీసుకోవాలి : క్రిసిల్
కోవిడ్-19 మహమ్మారి ప్రభావం మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో తగిన చర్యలు తక్షణమే తీసుకోవాలని క్రిసిల్ అంటోంది. కరోనాతో సర్వీసుల రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని, ఈ రంగానికి తక్షణమే ద్రవ్యపరంగా మద్దతు అందించాలని సూచిస్తోంది. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేందుకుగాను విత్తపరమైన, ద్రవ్యపరమైన చర్యలు కూడా తీసుకోవాలని అంటోంది. విమానయా న కంపెనీలు, హోటళ్లు, మాల్స్, మల్టీప్లెక్స్లు, రెస్టారెంట్లు, రిటైలర్లకు ద్రవ్యపరంగా మద్దతు ఇవ్వాలని పేర్కొంది. ఈ రంగంలోని కంపెనీలు చాలా నష్టాల్లో ఉన్నాయని క్రిసిల్ ఆర్థికవేత్తలు, విశ్లేషకులు ఒక నివేదికలో పేర్కొన్నారు. కరోనాను కట్టడి చేయకపోతే చైనాకు భారత్ నుంచి ఎగుమతయ్యే పత్తి, ఇనుప ఖనిజం, పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ భారీగా తగ్గవచ్చని అంటున్నారు. ఫార్మా, ఆటోమొబైల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ర్టానిక్స్, టెలికాం/స్మార్ట్ఫోన్ ఎక్వి్పమెంట్ దిగుమతులు కూడా తగ్గడానికి అవకాశం ఉందని, ఫలితంగా దేశీయ పరిశ్రమలకు ఇబ్బందులు ఏర్పడవచ్చని చెబుతున్నారు.
భారత్ వృద్ధి 5.1 శాతమే : ఫిచ్
కరోనాతో సప్లయ్ చెయిన్లో తీవ్ర విఘాతాలు ఏర్పడ్డాయని, పెట్టుబడులు, ఎగుమతులపైనా వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్ 5.1 శాతం వృద్ధిని మాత్రమే సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి కూడా తగ్గుతోందని, ఇప్పుడు ప్రపంచం మాంద్యంలో ఉందని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ 5.6 శాతం వృద్ధిని సాధించడానికి అవకాశం ఉందని గత డిసెంబరులో ఫిచ్ పేర్కొంది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో వృద్ధి అంచనాను 5.1 శాతానికి తగ్గించింది. ఇక 2019-20 సంవత్సరంలో జీడీపీ వృద్ధి 5.0 శాతం ఉండవచ్చని ఫిచ్ చెబుతోంది.