బీఎస్ లిమిటెడ్కు హైకోర్టులో ఊరట
ABN , First Publish Date - 2020-12-13T07:19:01+05:30 IST
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ).. బ్యాంకులకు జారీ చేసిన మాస్టర్ సర్క్యులర్ విషయంలో తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో బీఎస్ లిమిటెడ్కు ఊరట లభించింది...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ).. బ్యాంకులకు జారీ చేసిన మాస్టర్ సర్క్యులర్ విషయంలో తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో బీఎస్ లిమిటెడ్కు ఊరట లభించింది. అనుమానాస్పద ఖాతాలను మోసపూరిత ఖాతాలుగా ప్రకటించి అన్ని బ్యాంకులకు సమాచారం ఇవ్వాలని ఆదేశిస్తూ ఆర్బీఐ ఈ సర్క్యులర్ను జారీ చేసింది. ఈ సర్క్యులర్లో సహజ న్యాయసూత్రాల ప్రకారం ‘ఆడి ఆలె్ట్రమ్ పార్టెమ్’ (ఇరు పక్షాల వాదనలు వినాలన్న సూత్రం) కుట్రపూరితంగా అదృశ్యమైందని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది.
బీఎస్ లిమిటెడ్ దివాలా కేసులో జాయింట్ లెండర్స్ ఫోరం (జేఎల్ఎఫ్) 2019 ఫిబ్రవరి 15 తీసుకున్న నిర్ణయం, దాని ఆధారంగా ఫ్రాడ్ ఐడెంటిఫికేషన్ కమిటీ (ఎఫ్ఐసీ) అదే ఏడాది జూలై 31న చేసిన తీర్మానాల్ని కొట్టివేస్తున్నట్లు బెంచ్ స్పష్టం చేసింది. ఫోర్సెనిక్ ఆడిటర్ నివేదిక, దివాలా పరిష్కార నిపుణుడు (ఐఆర్పీ) కేవీ శ్రీనివాస్ ఇచ్చిన నివేదికలను పిటిషనర్కు, అఫీషియల్ లిక్విడేటర్ (ఓఎల్)కు ఇచ్చి వారు ఇచ్చే వివరణను తీసుకోవాలని బెంచ్ స్పష్టం చేసింది. పిటిషనర్, అఫీషియల్ లిక్విడేటర్లు తమ వాదనలు చెప్పేందుకు వ్యక్తిగతంగా అవకాశం ఇచ్చిన మీదటే జేఎల్ఎఫ్.. ఖాతాలు మోసపూరితమైనవో కాదో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. జేఎల్ఎఫ్ నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని నిర్ధారిస్తారా? లేదా అనేదానిపై ఎఫ్ఐసీ తీర్మానం చేయాలని తెలిపింది. ఈ ప్రక్రియ మొత్తం కోర్టు ఆదేశాలు అందిన మూడు నెలల్లోగా జాయింట్ లెండర్ ఫోరమ్ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. జేఎల్ఎఫ్ నిర్ణయం తీసుకున్న రెండు నెలల్లోగా ఎఫ్ఐసీ ప్రక్రియ పూర్తి చేయాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ బి విజయ్సేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
బీఎస్ లిమిటెడ్ దాదాపు రూ.1,500 కోట్ల రుణం తీసుకుని చెల్లించకపోవటంతో ఎస్బీఐ దివాలా చర్యలు చేపట్టింది. అంతేకాకుండా బీఎస్ లిమిటెడ్ బ్యాంకు ఖాతాలను మోసపూరితమైనవిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రకటించింది. దీన్ని సవాల్ చేస్తూ బీఎస్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. ఇదే అంశానికి సంబందించి మరికొన్ని సంస్థలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపి ఈ నెల 10న తీర్పును వెలువరించింది.