కరోనా కట్టడికి ముందుకు వచ్చిన ఆనంద్ మహీంద్ర

ABN , First Publish Date - 2020-03-23T22:23:12+05:30 IST

కరోనా విజృంభనకు సరైన సదుపాయాలు లేకపోవడం ప్రధాన కారణం. అయితే కరోనాను అడ్డుకునేందుకు వెంటిలేటర్లు ఏర్పాటు చేయిస్తున్నామని ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర తెలిపారు

కరోనా కట్టడికి ముందుకు వచ్చిన ఆనంద్ మహీంద్ర

ముంబై: కరోనా విజృంభనకు సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం ప్రధాన కారణమని ఎక్కువగా వినిపిస్తున్న వాదన. అయితే కరోనాను అడ్డుకునేందుకు వెంటిలేటర్లు ఏర్పాటు చేయిస్తున్నామని ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర తెలిపారు. ఆదివారం వరుస ట్వీట్లతో కరోనా కట్టడికి తాము చేయదల్చుకున్న పనిని వివరించుకొచ్చారు. ఇండియాలో కరోనా వ్యాప్తి రెండవ స్టేజి చివరిలో ఉందని, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మూడవ స్టేజిలోకి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇందు కోసం ప్రభుత్వానికి చేదోడుగా రిసార్టుల్లో తాత్కాలిక వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు.


‘‘ప్రస్తుతం మన దేశంలో కరోనా మూడో దశలో అడుగు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది కనుక జరిగితే లక్షలాది మంది ప్రాణనష్టంతో కేసులు విపరీతంగా పెరగవచ్చు. ఇది మౌళిక సదుపాయాల కల్పనపై భారీ ఒత్తడిని తీసుకువస్తుంది. కొద్ది వారాల పాటు లాక్‌డౌన్ చేయడం కొన్ని మంచి ఫలితాలనే ఇచ్చినప్పటికీ మెడికల్ కేర్‌కై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది. మనకు వెంటిలేటర్ల కొరత ఎక్కువగా ఉంది. అందుకే మనం తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేసుకోవాలి.


దీని కోసం మహీంద్ర గ్రూపు సత్వర చర్యలు ప్రారంభించింది. రిసోర్ట్స్‌లో తాత్కాలికంగా వెంటిలేటర్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నాం. వీటిని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి, సైన్యానికి సహాయం చేయడానికి మా ప్రజెక్ట్ బృందం సిద్ధంగా ఉంది. అంతే కాకుండా మహీంద్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక సహాయ నిధిని ఏర్పాటు చేసి చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధిదారులకు సహాయం చేస్తాము. దీని కోసం మేము స్వచ్ఛంద విరాళాలు సేకరిస్తాము. నా జీతం 100 శాతం విరాళంగా ఇస్తాను. మరో కొద్ది నెలల పాటు ఇస్తాను. మా సహ వ్యాపారులు కూడా ముందుకు రావాలని నేను అర్థిస్తున్నాను’’ అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.

Updated Date - 2020-03-23T22:23:12+05:30 IST