‘ఫ్యూచర్’కు అమెజాన్ లీగల్ నోటీసు!
ABN , First Publish Date - 2020-10-08T05:53:11+05:30 IST
ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్), కిశోర్ బియానీ వ్యాపార సామ్రాజ్యం ఫ్యూచర్ గ్రూప్ మధ్య కుదిరిన ఒప్పందం చిక్కుల్లో పడింది...

- ముకేశ్తో బియానీ డీల్కు మోకాలడ్డు
ముంబై: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్), కిశోర్ బియానీ వ్యాపార సామ్రాజ్యం ఫ్యూచర్ గ్రూప్ మధ్య కుదిరిన ఒప్పందం చిక్కుల్లో పడింది. ఇరు వర్గాల మధ్య డీల్ను సవాలు చేస్తూ అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఫ్యూచర్ గ్రూప్ ప్రమోటర్లకు లీగల్ నోటీసు పంపినట్లు సమాచారం. గతంలో తమతో కుదుర్చుకు ఒప్పందాన్ని ఫ్యూచర్ గ్రూప్ ఉల్లంఘించిందని అమెజాన్ అంటోంది. అయితే, ఈ విషయంపై స్పందించేందుకు రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ స్పందించేందుకు నిరాకరించాయి. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే, ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన రిటైల్, టోకు, లాజిస్టిక్స్, వేర్హౌజింగ్ వ్యాపారాలను రూ.24,713 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఈ ఆగస్టు చివర్లో ఆర్ఐఎల్ అనుబంధ ఆర్ఆర్వీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది.
2019 ఆగస్టులో అమెజాన్-ఫ్యూచర్ గ్రూప్ మధ్య కూడా ఓ డీల్ జరిగింది. ఫ్యూచర్ కూపన్స్లో 49 శాతం వాటాను అమెజాన్ దాదాపు రూ.1,500 కోట్ల కు కొనుగోలు చేసింది. తద్వారా అమెజాన్కు ఫ్యూచర్ గ్రూప్ ప్రధాన కంపెనీ అయిన ఫ్యూచర్ రిటైల్లో పరోక్షంగా 7.3 శాతం వాటా దక్కింది. ఆ ఒప్పందంలో భాగంగా, ఫ్యూచర్ రిటైల్లో ప్రమోటర్ వాటాను మొత్తం గా కొనుగోలు చేసే ప్రథమ హక్కునూ అమెజాన్ దక్కించుకుంది. ఆర్ఆర్వీఎల్ ఒప్పందం ఈ నిబంధనకు ఉల్లంఘన అన్నది అమెజాన్ వాదం.