ఎయిర్ బ్యాగ్... ఇక తప్పనిసరి...
ABN , First Publish Date - 2020-12-30T02:33:33+05:30 IST
కేంద్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కార్లలో ఎయిర్ బ్యాగులు తప్పనిసరి చేసింది. ఈ మేరకు మంగళవారం ఓ ముసాయిదా నోటిఫికేషన్ను జారీ చేసింది.
న్యూఢిల్లీ : కేంద్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కార్లలో ఎయిర్ బ్యాగులు తప్పనిసరి చేసింది. ఈ మేరకు మంగళవారం ఓ ముసాయిదా నోటిఫికేషన్ను జారీ చేసింది. కార్లు తదితర ప్యాసింజర్ వాహనాల ముందు సీటుల్లో కూడా ఎయిర్ బ్యాగులు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన త్వరలో దేశవ్యాప్తంగా అమలు కానుంది. ప్రస్తుతానికి మాత్రం... డ్రైవర్ సీటు వద్ద మాత్రమే ఎయిర్ బ్యాగు తప్పనిసరి చేశారు. ఇకపై ముందు వరుసలో డ్రైవర్ పక్కన ఉండే సీటు వద్ద కూడా ఎయిర్ బ్యాగు ఉండాల్సిందే..
కాగా... కేంద్ర రవాణా శాఖ జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం... కారు ముందు వైపు ఉండే ప్యాసింజర్ సీటులో కూడా ఎయిర్ బ్యాగు ఉండాలనే నిబంధనకు అనుగుణంగా వాహనదారులు మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను కొత్త మోడల్ కార్లకు 2021, ఏప్రిల్ 1 వరకు, ఇప్పటికే వాడుతున్న కార్లకు 2021, జూన్ 1 గడువు తేదీలుగా నిర్ణయించింది. ఎయిర్ బ్యాగుల ప్రమాణాల గురించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) ఆదేశాలు వెలువడేంత వరకు అవి ఏఐఎస్ 145 నిబంధనలకు అణుగుణంగా ఉండాలని ఈ నోటిఫికేషన్లో సూచించారు. ఇక భవిష్యత్తులో తయారు చేసే వాహనాల్లో ప్రయాణికుల సీట్లలో కూడా ఎయిర్ బ్యాగులను అమర్చేలా ఆటోమేటిక్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్(ఏఐఎస్) నిబంధనల్లో మార్పులు చేయనున్నారు.
కాగా, 2019, జులై 1 నుంచి అన్ని కార్లలో డ్రైవర్ సీటులో ఎయిర్ బాగు తప్పనిసరిగా ఉండాలనే నిబంధనలున్న విషయం తెలిసిందే. అయితే డ్రైవర్ సీటు పక్కన కూర్చొనే ప్రయాణికులకు కూడా అంతే ప్రమాదం పొంచివుండే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో కేంద్రం తాజా మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ ముసాయిదా నోటిఫికేషన్ చెల్లుబాటు వ్యవధి 30 రోజుల్లో పూర్తవుతుందని, ఈ క్రమంలో... ఏవైనా అభ్యంతరాలుంటే రవాణా శాఖ సహ కార్యదర్శి దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు.