జియో నెత్తిన ఆర్కామ్ ఏజీఆర్ భారం
ABN , First Publish Date - 2020-08-15T06:23:38+05:30 IST
టెలికాం ఏజీఆర్ బకాయిల భారం రిలయన్స్ జియోపైనా పడే సూచనలు కనిపిస్తున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) స్పెక్ట్రమ్ వాడుకుంటున్న రిలయన్స్ జియో నుంచి ఈ బకాయిలను ఎందుకు వసూలు చేయకూడదని...
- స్పెక్ట్రమ్ వాడుకున్నందుకు చెల్లించాల్సిందే: సుప్రీంకోర్టు
న్యూఢిలీ: టెలికాం ఏజీఆర్ బకాయిల భారం రిలయన్స్ జియోపైనా పడే సూచనలు కనిపిస్తున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) స్పెక్ట్రమ్ వాడుకుంటున్న రిలయన్స్ జియో నుంచి ఈ బకాయిలను ఎందుకు వసూలు చేయకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘స్పెక్ట్రమ్ ప్రభుత్వ ఆస్తి. జియో నిజం గా ఆర్కామ్ స్పెక్ట్రమ్ను ఉపయోగించుకుంటుంటే, ఆ కంపెనీ ఏజీఆర్ బకాయిలు జియోనే చెల్లించాలి’ అని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. మూ తపడిన మిగతా టెలికాం కంపెనీల స్పెక్ట్రమ్ వాడుకుంటున్న టెలికాం కంపెనీలకూ ఇది వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆయా కంపెనీల మధ్య కుదిరిన అన్ని ఒప్పందాల వివరాలను తమ ముందు ఉంచాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.
రూ.25,195 కోట్ల భారం: సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలతో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోపై రూ. 25,195 కోట్ల మేర భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. స్పెక్ట్రమ్ ఏజీఆర్ బకాయిల కింద ఆర్కామ్ ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. రిలయన్స్ జియో 2016 నుంచి మూతపడిన ఆర్కామ్కు చెందిన 800 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్ను వాడుకుంటోంది.