సారూ.. ఆయన మరణించారు
ABN , First Publish Date - 2020-10-27T08:17:49+05:30 IST
ఆ అధికారి ఈ నెల 21వ తేదీన అనారోగ్యంతో చనిపోయారు. ఆ తరువాత ఐదు రోజులకు అదే అధికారి డిప్యుటేషన్ గడువును మరో ఏడాదికి పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
![సారూ.. ఆయన మరణించారు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఈ నెల 21న జడ్పీ సీఈవో మృతి
డిప్యుటేషన్ గడువు పెంచుతూ 5రోజుల తర్వాత జీవో
శ్రీకాకుళం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆ అధికారి ఈ నెల 21వ తేదీన అనారోగ్యంతో చనిపోయారు. ఆ తరువాత ఐదు రోజులకు అదే అధికారి డిప్యుటేషన్ గడువును మరో ఏడాదికి పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ కలెక్టర్గా పనిచేసే జీ చక్రధరరావు డెప్యుటేషన్పై గత ఏడాది శ్రీకాకుళం జడ్పీ సీఈవోగా వచ్చారు. ఆయన డిప్యుటేషన్ గడువు ముగుస్తుండటంతో, దానిని పొడిగించే ప్రతిపాదనతో జిల్లా అధికారులు ఫైల్ తయారుచేశారు. ఆ ఫైల్ను రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖకు పంపించారు. ఆ శాఖ పరిశీలించి.. చక్రధరరావు డిప్యుటేషన్ను 2021 ఆగస్టు 21వ తేదీ వరకు పొడిగిస్తూ సోమవారం జీవో విడుదల చేసింది. అయితే, ఆ ఆదేశాలు అందుకోవడానికి చక్రధరరావు లేరు. జీవో రావడానికి ఐదు రోజుల ముందే విశాఖలోని ఓ ఆస్పత్రిలో అనారోగ్యంతో మృతిచెందారు. ఆ మరుసటి రోజున అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. కానీ మరణించిన అధికారి పేరిట ఏకంగా జీవో కూడా విడుదలైంది.