భారత్‌ బంద్‌ విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2020-12-08T01:40:57+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు

భారత్‌ బంద్‌ విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం

అమరావతి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు దీక్ష చేపట్టిన విషయం విదితమే. రైతన్న దీక్షకు మోదీ సర్కార్ దిగిరాకపోవడంతో.. రైతులపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 8న (బుధవారం) రైతు సంఘాలు తలపెట్టిన భారత్‌ బంద్‌ విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న మొన్నటి వరకూ ఈ బంద్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోని ఏపీ ప్రభుత్వం.. రేపు బంద్ అనగా.. ఇవాళ సాయంత్రం తన నిర్ణయాన్ని ప్రకటించింది. 


బంద్‌కు మద్దతు

భారత్‌ బంద్‌కు ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. బంద్ సందర్భంగా రేపు ఏపీలో విద్యా సంస్థలు బంద్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఒంటి గంట తర్వాతనే ప్రభుత్వ కార్యాలయాలను తెరవాలని ఆదేశించింది. ఏపీలో ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపొద్దని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. బంద్ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని రైతు సంఘాలకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.


బాబుపై విమర్శలు..

ఈ సందర్భంగా.. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. బంద్ విషయంలో రైతు సంఘాల మనోభావాలను గౌరవిస్తున్నామన్నారు. వ్యవసాయ బిల్లుల విషయంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని విమర్శలు గుప్పించారు. ఆ రోజు బిల్లుకు మద్దతిచ్చి చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారని.. కేంద్రంతో రైతుల చర్చలు సఫలం కావాలని కోరుకుంటున్నామన్నారు. రైతుపక్షపాత ప్రభుత్వంగా బంద్‌కు మద్దతిస్తున్నామని కన్నబాబు స్పష్టం చేశారు. 


కాగా..  భారత్‌ బంద్‌ పిలుపునకు టీఆర్ఎస్, కాంగ్రెస్‌తోపాటు ఆర్జేడీ, తృణమూల్‌ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఆర్‌ఎస్‌పీ, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ తదితర వామపక్షాలు, డీఎంకే మద్దతు ప్రకటించిన విషయం విదితమే.


Updated Date - 2020-12-08T01:40:57+05:30 IST