అన్నిటినీ కులమయం చేసిన వైసీపీ

ABN , First Publish Date - 2020-09-29T08:26:30+05:30 IST

రాష్ట్రం లో వైసీపీ వైఫల్యాలను ఎత్తి చూపిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరిపై కులం పేరుతో దాడి చేయడం ఎబ్బెట్టుగా ఉందని రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌ అన్నారు.

అన్నిటినీ కులమయం చేసిన వైసీపీ

వాటిపై మాట్లాడడం అసహ్యకరం..

సునీల్‌ దేవధర్‌ ఆగ్రహం


అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో వైసీపీ వైఫల్యాలను ఎత్తి చూపిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరిపై కులం పేరుతో దాడి చేయడం ఎబ్బెట్టుగా ఉందని రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌ అన్నారు. ఆమెకు  కులం ఆపాదిస్తూ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ‘కుల, మతాలకు అతీతంగా దేశ నిర్మాణమే ధ్యేయంగా పనిచేసే పార్టీ బీజేపీ. అటువంటి పార్టీ అర్హతే ప్రామాణికంగా ఒక మహిళకు కీలక  బాధ్యతలు అప్పగిస్తే కులంతో ముడిపెడతారా? అన్నీ కులమయం చేసిన వైసీపీ. కులాల గురించి మాట్లాడటం అసహ్యంగా ఉంది’ అని సోమవారం ట్విటర్‌లో ధ్వజమెత్తారు.


జైలుకు వెళ్లొచ్చిన అవినీతి చక్రవర్తి ఏ-2 ఆమెపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం  పేర్కొన్నారు. దళిత, బీసీ రైతుల గురించి మాట్లాడిన ఆమె.. జాతి ప్రయోజనం కో సం మాట్లాడిన తెలుగు జాతి నాయకురాలని, పురందేశ్వరిని బీజేపీ జాతీయ ప్ర ధాన కార్యదర్శిగా ప్రకటించిన రోజు ఎవరెవరితో ఫేస్‌టైమ్‌లో మాట్లాడారో వెల్లడిం చే ధైర్యం సాయిరెడ్డికి ఉందా అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్‌ నాయుడు నిలదీశారు.


ఢిల్లీలో కాళ్లుపట్టుకుంటూ.. రాష్ట్రంలో బీజేపీ నాయకులపై ప్రేలాపన పేలుతున్నారని బీజేపీ కిసాన్‌ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు యార్లగడ్డ రాం మ్‌కుమార్‌ అన్నారు. విశాఖలో పిచ్చిపట్టి తిరుగుతున్న సాయిరెడ్డికి వైద్యం చేయించాల్సి ఉందని లంకా దినకర్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు.  సాయిరెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుపక్రాశ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. 



సైబర్‌ కేసులు పెడతాం: బీజేపీ 


టీడీపీ, వైసీపీ కోసం బీజేపీపై కొన్ని వెబ్‌సైట్లు, వాట్సాప్‌ గ్రూపులు దుష్ప్రచారం చేస్తున్నాయని.. వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు బీజేపీ వెల్లడించింది. ఇటీవలి కాలంలో మిషన్‌ ఏపీ పేరుతో వాట్సాప్‌ గ్రూప్‌.. నమస్తే ఆంధ్ర, తెలుగు 360, తొలివెలుగు పేర్లతో యూట్యూబ్‌ చానళ్లు, ఇతర పోర్టల్స్‌లో తమపై దుష్ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని రాష్ట్ర బీజేపీ ప్రకటనలో పేర్కొంది.  


Updated Date - 2020-09-29T08:26:30+05:30 IST