వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది: గోరంట్ల
ABN , First Publish Date - 2020-03-16T17:55:22+05:30 IST
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. వాలంటీర్లతో ఓటర్లను బెదిరించటం.. పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి అభ్యర్థులు నామినేషన్లు
రాజమండ్రి: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. వాలంటీర్లతో ఓటర్లను బెదిరించటం.. పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ భ్రష్టుపట్టిందన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో కీలకమైన పోస్టులన్నీ ముఖ్యమంత్రి సామాజిక వర్గం వారికే కేటాయించారని ఆరోపించారు. కమ్మ జాతిని అణచివేయాలనే ఆలోచనే ముఖ్యమంత్రి జగన్ను పతనం చేస్తుందని పేర్కొన్నారు. కరోనా ప్రభావంతో ఎన్నికలను వాయిదా వేస్తే.. ఎన్నికల కమిషనర్కూ కులం అంటగట్టడం దుర్మార్గం అన్నారు. పవన్ కళ్యాణ్ను పవన్ నాయుడు అని ఎందుకు పిలుస్తున్నారని గోరంట్ల ప్రశ్నించారు. కరోనా కంటే భయంకరమైన వ్యాదితో సీఎం జగన్ బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ప్రజల దౌర్భాగ్యం వల్ల జగన్ ముఖ్యమంత్రి అయ్యాడని అన్నారు. కమ్మ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టారని ఆరోపించారు. కమ్మ సామాజిక వర్గం ఏం అన్యాయం చేసిందని గోరంట్ల ప్రశ్నించారు. ఇసుక దోపిడీ చేసి రాజమండ్రి నుంచి సూట్ కేసులు వెళ్లిపోతున్నాయని ఆరోపించారు. ఇప్పటి వరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి మళ్లీ ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించాలని గోరంట్ల డిమాండ్ చేశారు.