ఎవరి వాటా ఎంతో తేలుస్తాం: ఈఎస్ఐ స్కామ్పై ఏసీబీ
ABN , First Publish Date - 2020-08-22T09:06:24+05:30 IST
ఈఎ్సఐ స్కామ్లో ఎవరి వాటా ఎంతో సమగ్ర దర్యాప్తు జరిపి వెలికి తీస్తామని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) జాయింట్ డైరెక్టర్ ..
అమరావతి/కర్నూలు, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి):ఈఎస్ఐ స్కామ్లో ఎవరి వాటా ఎంతో సమగ్ర దర్యాప్తు జరిపి వెలికి తీస్తామని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) జాయింట్ డైరెక్టర్ రవి కుమార్ అన్నారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా ఎవరికి ఎంత డబ్బులు చేరాయో ఇప్పటి వరకూ ఆధారాలు లభించలేదన్నారు. అంత మాత్రాన నిందితుల మధ్య లావాదేవీలు జరగలేదని కాదని, ఇప్పటి వరకూ ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత లబ్ధి పొందినట్లు అర్థం అవుతోందన్నారు. అయితే ఆధారాల్లేకుండా ఎవరి పేరునూ వెల్లడించలేమన్నారు. అందుకే పాత్రికేయులు అడిగినప్పుడు కూడా అచ్చెన్నకు డబ్బులు ఇచ్చినట్లు ఎవరూ వెల్లడించలేదని మాత్రమే చెప్పానంటూ వివరించారు.